బీహార్ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్ జరుగుతోంది.. ఓటర్లు ఎటువైపో తెలియక పార్టీలు .. రాజకీయపార్టీల సిద్ధాంతాలేమిటో తెలియక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.. ఇదో ఆసక్తికరమైన అంతకు మించి గమ్మత్తయిన పరిస్థితి… లోక్జనశక్తి పార్టీనే తీసుకోండి… ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వానేమో కేంద్రంలో బీజేపీతో దోస్తీ ఉందని బహిరంగంగా చెబుతుంటారు.. బీజేపీ నేతలేమో అబ్బే అదేం లేదని అంటుంటారు.. పైగా చిరాగ్ పాశ్వాన్పై విమర్శలు కూడా చేస్తుంటారు.. నిన్నటికి నిన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే చిరాగ్ను ఎవరూ నమ్మరంటూ తేల్చేశారు.. అసలు ఎల్జేపీతో ఎన్డీయేకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.. ఇవన్నీ ఓటర్లను కన్ఫ్యూజ్కు గురి చేస్తున్నాయి.. ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి అయ్యేది నితీశ్కుమారేనని, తాము భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అనురాగ్ ఠాకూర్ అన్నారు. పనిలోపనిగా ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిపై కూడా నాలుగు అక్షింతలు వేశారు.. మహాగడ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యీదవ్పై గట్టి విమర్శలే చేశారు.. లాలూ ప్రసాద్ యాదవ్ వారసులను అస్సలు నమ్మడానికి వీల్లేదని చెబుతూ పోస్టర్ల నుంచి తమ తల్లిదండ్రుల ఫోటోలు లేకుండా వాళ్లు ఏం చేయగలరని ప్రశ్నించారు.. కులాల ఆధారంగా విభజన రాజకీయాలు చేయడం తప్ప వారికి ఇంకేమీ చేతకాదని అన్నారు. అలాంటి వారు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసన్నారు అనురాగ్ ఠాకూర్. పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని ప్రజలకు సూచించారు. ఇదిలా ఉంటే కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాత్రం చిరాగ్పై ప్రశంసల జల్లు కురిపించడం గమనార్హం. చిరాగ్ పాశ్వాన్ ఓ శక్తివంతమైన నేత అని తేజస్వీ సూర్య అన్నారు.. ఆయన తనకు స్పెషల్ ఫ్రెండని చెప్పుకొచ్చారు.. బీహార్ సమస్యలను పరిష్కరించగలిగే సత్తా ఆయనలో ఉందన్నారు.. చిరాగ్కు ముందుస్తు శుభాకాంక్షలు కూడా చెప్పారు తేజస్వీ సూర్య..మొత్తం మీద బీహార్ ఓటర్లు కాస్త ఆయోమయస్థితిలో ఉన్నమాట మాత్రం నిజం!