
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పేమెంట్ గేట్వే వ్యవస్థను సమూలంగా మార్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్ అధికారులతో చర్చలను ప్రారంభించింది. సీబీఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారులతో కూలంకషంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో, ముఖ్యంగా పునఃమూల్యాంకనం, జవాబు పత్రాల ఫోటోకాపీలు పొందడం, ఇతర రుసుము ఆధారిత ప్రక్రియల వంటి పరీక్షానంతర సేవల కోసం పటిష్టమైన, నమ్మకమైన, విద్యార్థి-స్నేహపూర్వక చెల్లింపుల వ్యవస్థ అవసరాన్ని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నొక్కి చెప్పారు.
సకాలంలో లావాదేవీలు జరిగేలా, చెల్లింపులకు సంబంధించిన సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా, అధికంగా లేదా విఫలమైన చెల్లింపుల సందర్భాలలో ఆటోమేటిక్ రీఫండ్లు అందేలా పటిష్టమైన చెల్లింపుల ప్రోటోకాల్లను ఏర్పాటు చేయడంలో సీబీఎస్ఈకి సహకరించాలని ఆయన బ్యాంకులను ఆదేశించారు. అధునాతన సాంకేతిక భద్రతా చర్యలు, రియల్-టైమ్ పర్యవేక్షణ, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల ద్వారా పేమెంట్ గేట్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సీబీఎస్ఈతో కలిసి పనిచేయాలని బ్యాంకులను కోరడం జరిగింది.
భవిష్యత్తులో విద్యార్థులు సాంకేతిక లోపాలు లేదా చెల్లింపు వైఫల్యాలను ఎదుర్కోకుండా ఉండేందుకు, ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతాధికారులను కోరారు. సులభమైన, సురక్షితమైన, సమర్థవంతమైన డిజిటల్ లావాదేవీలను నిర్ధారించాలని ఆయన బ్యాంకులకు పిలుపునిచ్చారు.
సీబీఎస్ఈతో సమన్వయంతో, మెరుగైన ప్రోటోకాల్లు, సాంకేతిక అప్గ్రేడ్లను వీలైనంత త్వరగా అమలు చేయడానికి నాలుగు బ్యాంకులు పూర్తి మద్దతు, నిబద్ధతను ప్రకటించాయి.
అంతకుముందు, 2026 మే 24న, సీబీఎస్ఈ ఫలితాల అనంతర, పునఃమూల్యాంకన ప్రక్రియల సమయంలో విద్యార్థులు ఎదుర్కొన్న ఇటీవలి చెల్లింపు, సాంకేతిక సమస్యలకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చలు జరిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..