Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు నాయర్ అరెస్ట్..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్కాం ఎఫ్ఐఆర్లో 5వ నిందితుడిగా విజయ్నాయర్ పేరు ఉంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. పలు కీలక వివరాలను సేకరించారు. ఈ క్రమంలో లిక్కర్ స్కాం కేసులో తొలి అరెస్ట్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్కాం ఎఫ్ఐఆర్లో 5వ నిందితుడిగా విజయ్నాయర్ పేరు ఉంది. ఢిల్లీలో 8 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత విజయ్నాయర్ను మంగళవారం అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ అంతకుముందు ‘ఓన్లీ మచ్ లౌడర్’ సంస్థకు సీఈఓగా పనిచేశారు. అంతేకాకుండా ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియా ప్రధాన అనుచరుడిగా కూడా ఉన్నారు.
కాగా.. ముంబై కేంద్రంగా ఎంటర్టైన్మెంట్, ఈవెంట్ మీడియా పేరు గడించిన ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించిందని ఆరోపణలు వచ్చాయి. కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ నాయర్ దగ్గర పలు కీలక ఆధారాలు లభించడంతో మంగళవారం ముంబైలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో భాగంగా అంతకుముందు ఈడీ నాయర్ ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించింది. పలు ఆధారాలు లభించడంతో గతనెల 21వ తేదీన సీబీఐ లుక్ అవుట్ నోటీసులు కూడా జారీచేసింది. అందులో 8 మంది ఉండగా.. వారిలో విజయ్ ఒకరు. అయితే దాడుల సమయంలో విజయ్ తప్పించుకున్నారని అధికారులు తెలిపారు.
విజయ్ నాయర్ ఎవరంటే..
సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహచరుడు అర్జున్ పాండే.. విజయ్ నాయర్ మధ్యవర్తిత్వంతో ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు నుంచి సుమారు రూ.2 నుండి 4 కోట్ల వరకు నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగులకు నాయర్ డబ్బు ఇచ్చినట్లు సమాచారం..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి