మరో నిర్భయ ఘటన.. ఇంతకీ ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో ఏం జరిగింది..?

| Edited By: Janardhan Veluru

Aug 14, 2024 | 6:55 PM

Kolkata Doctor Rape-Murder Case: అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఆమె ప్రైవేటు పార్టులపై గాయాలు చేసి దారుణంగా చంపినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. మృతురాలి ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించిందని.. బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరో నిర్భయ ఘటన.. ఇంతకీ ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో ఏం జరిగింది..?
Kolkata Doctor Rape Murder Case
Follow us on

వైద్యో నారాయణో హరిః వైద్యులు దేవుళ్లతో సమానం అని అర్థం. అలాంటి వైద్యులకే రక్షణ లేకుండా పోతే..? ప్రాణం పోయాల్సిన వైద్యుల ప్రాణాలు తీసుకుంటూ పోతే..? అవును.. మీరు వింటున్నది అక్షరాల నిజమే. మరికొద్ది రోజుల్లో స్టెతస్కోప్‌ పట్టుకుని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ట్రైనింగ్‌ అవుతున్న వైద్యవిద్యార్థినిని అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నాడు ఓ కీచకుడు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్‌ దేశాన్ని కుదిపేస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జీకర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ అమానవీయ ఘటన కోల్‌కతానే కాకుండా దేశం మొత్తాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది.

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఘటన జరిగి ఐదు రోజులు అయినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నది. కేసు డైరీని, ఇతర డాక్యుమెంట్లను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. విధుల బహిష్కరణను విరమించుకోవాలని, రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న వైద్యులను చీఫ్‌ జస్టిస్‌ శివజ్ఞానం నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కోరింది. కేంద్రమంత్రి నడ్డా తమ డిమాండ్లకు అంగీకరించడంతో నిరసనలను విరమిస్తున్నట్టు ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. అయితే ఈ విషయంలో అసోసియేషన్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సమగ్రమైన ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగించాలని ఎయిమ్స్ ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్స్, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నిర్ణయించాయి. అటు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ హత్యాచారం కేసుపై సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టేసింది. బుధవారంనాడు సీబీఐ స్పెషల్ టీమ్ కోల్‌కత్తా చేరుకుంది.

Kolkata Doctor Rape Murder Case

ఆ రోజు ఏం జరిగిందంటే..?

2024, ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్.. ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉంది. బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్‌మెంట్ సెమినార్ హాల్‌కు వెళ్లింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు.

అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఆమె ప్రైవేటు పార్టులపై గాయాలు చేసి దారుణంగా చంపినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. మృతురాలి ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించిందని.. బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతు నులిమి చంపడంతో.. ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 9వ తేది శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగినట్లు వైద్యుల పోస్టుమార్టం నివేదించింది.

పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. మృతురాలి చాతి, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు ఉన్నాయి. బాధితురాలి నోరు మూసేసి.. కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి.. ఆమె తలను గోడకు లేదా నేలపై అదిమిపట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. అసహజ లైంగిక చర్య.. పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాలలో లోతైన గాయం అయినట్లు గుర్తించారు.

దుర్మార్గుడి దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో మృతురాలి ముఖానికి గోటితో చేసిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌ని బట్టి తెలుస్తోంది. అయితే ఆమె కళ్లకు ఎందుకు గాయాలు అయ్యాయో నిర్ధారణ కాలేదు. అత్యాచారం.. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమినార్‌ హాల్‌లో గుర్తించారు. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Kolkata Doctor Rape Murder Case

భగ్గుమన్న జూడాలు..

ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం.. హత్యపై జూనియర్‌‌ డాక్టర్లు భగ్గుమన్నారు. ఈ హత్యోదంతంపై డాక్టర్లు, విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. మెడికోల ఆందోళనలతో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించారు.

కీచకుడిని పట్టించిన క్లూ..

ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యం సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ కి చెందిన హెడ్ సెట్ పడిపోయింది. ఇది గుర్తించని సంజయ్ ఆ ఇన్సిడెంట్ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహం బయటపడ్డాక అందరిలాగా తాను కూడా అయ్యో పాపం అంటూ సానుభూతి ఒలకబోశాడు. అయితే, హత్యా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్ సెట్ దొరికింది. అది మృతురాలిది కాదని తేలడంతో నిందితుడిదే అయ్యుంటుందని విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు. హత్యా స్థలంలో దొరికిన హెడ్ సెట్ కూడా అతడిదేనని తేలడంతో సంజయే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్దారణకొచ్చారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించారు.

ట్రైనీ డాక్టర్‌పై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడని తేలింది. అయితే, నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో అతడి గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బెంగాల్ పోలీస్‌ విభాగంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. పోకిరీ చేష్టలతో మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తేలింది. విచారణలో చేసిన తప్పునకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలిసింది. నిందితుడు.. తనను ఉరితీయాలనుకుంటే.. తీయండి.. అంటూ కరకుగా చెప్పడంతో పోలీసులు సైతం ఖంగుతిన్నారు.

Kolkata Doctor Rape Murder Case

నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు. అయినా క్యాంపస్‌లోని భవనాల్లో తరచుగా కనిపించేవాడని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, విపత్తులు సహా వివిధ రకాల పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియామకమైన కాంట్రాక్టు ఎంప్లాయ్. 2019లో కోల్‌కతా పోలీసుల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లో వాలంటీర్‌గా చేరాడు. అయితే ఆ తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. ఆ తర్వాత ఆర్‌జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో డ్యూటీ చేసేవాడు. ఇక్కడ రాయ్.. పోలీసుగా చెలామణి అవుతూ అక్రమాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.

అయితే సంజయ్‌రాయ్‌ కాండక్ట్ కూడా అంత బాగా ఏమీ లేదు. ఎప్పటి నుంచో అతడి ప్రవర్తన చెడుగానే ఉంది. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అతడి బ్యాడ్ బిహేవియర్ వల్లే ముగ్గురు భార్యలూ అతడిని విడిచిపెట్టేశారు. ఒక భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. నిందితుడు తరుచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడని స్థానికులు తెలిపారు.

మమత సర్కారుపైనా విమర్శలు..

ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు సైతం వేడెక్కాయి.. తృణముల్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది.ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో మమత సర్కారు ఎందుకు ఆలస్యం చేసిందంటూ విమర్శించింది. కేసు విచారణలో మొదటి 48 గంటలు అత్యంత కీలకమని, కానీ రాష్ట్ర పోలీసులు అలసత్వం, మమత సర్కారు ఆలస్యం చూస్తుంటే మొదట ఈ కేసు విషయంలో ఏ మాత్రం సీరియస్‌గా వ్యవహరించలేదని విషయం స్పష్టంగా అర్థమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. కాషాయదళం క్యాండిల్‌ మార్చ్‌, నిరసనలు చేపట్టింది.

నిజానికి ఈ కేసులు 5 రోజుల్లోగా విచారించి నిందితులెవరో తేల్చాలని కోల్‌కత్తా పోలీసులకు మమత ఆదేశించారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న హైకోర్టు కేసు విచారణలో ఏ మాత్రం పురోగతి లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఇది కచ్చితంగా సాక్ష్యాధారాలను చెరిపేయడానికి కారణం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, ఈ విషయంలో హాస్పటల్ నిర్లక్ష్యంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు.. తక్షణం ఈ కేసును సీబీఐకి బదిలీ చెయ్యాలని కూడా ఆదేశించింది.

Kolkata Doctor Rape Murder Case

సాక్ష్యాధారాలు తారుమారుచేసేందుకు కుటిల ప్రయత్నాలు

ఘటన జరిగిన శుక్రవారంనాడు ఉదయం అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తండ్రికి కేజీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆస్పత్రి వర్గాలు ఆయనకు ప్రాథమిక సమాచారం ఇచ్చారు. అయితే నేరుగా ఆస్పత్రికి వెళ్లి చూశాక.. అక్కడ జరిగింది ఏంటో మాకు అర్థమయ్యిందంటూ ట్రైనీ డాక్టర్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి.. తాను ఎవరన్న విషయం కూడా చెప్పలేదని తెలిపారు. తమ కుమార్తె ముఖాన్ని చూపించాలని వేడుకన్నా.. దాదాపు 3 గంటల నిరీక్షణ తర్వాతే ఆస్పత్రి వర్గాలు లోపలికి వెళ్లి ముఖాన్ని చేసేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఒక ఫొటో తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారని.. బయట ఉన్న వారికి ఆ ఫొటో మాత్రమే చూపినట్లు వెల్లడించారు. ఆ సమయంలో ట్రైనీ డాక్టర్ శరీరంపై వస్త్రాలు ఏమీ లేవని తెలిపారు. ఘటనా స్థలి దగ్గర సాక్ష్యాధారాలను తారుమార్చేందుకు ఆస్పత్రి సిబ్బంది ప్రయత్నించినట్లు దీని ద్వారా తేటతెల్లం అవుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ పశ్చిమ బెంగాల్ డాక్టర్ల ఫోరస్ మంగళవారంనాడు సీబీఐకి ఓ వినతి పత్రాన్ని అందజేసింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీ ప్రాంగణాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని వైస్ ఛాన్సలర్లకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

గతంలో ఢిల్లీలో నిర్భయ ఘటనలానే.. ఇప్పుడు కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారణ ఘటన కూడా యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఇటు జాతీయ మీడియాతో పాటు అటు అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఇన్సిడెంట్‌పై ఫుల్ ఫోకస్ చేశాయి.  నిర్భయ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరింత కఠిన చట్టాలను తీసుకురావడంతో పాటు.. వాటిని పాలకులు అంతే కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అర్థరాత్రి వేళ ఆడది ఒంటరిగా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రమని గాంధీజీ కలలు కన్నారు. మరి దేశం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ.. గాంధీజీ కల సాకారం ఇంకా ఎంత దూరంలో ఉందో? ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నగానే ఉంది.

గ్యాంగ్ రేప్ జరిగిందా..?

ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టిన నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె డెడ్‌బాడీకి నిర్వహించిన పోస్ట్ మార్టంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు గుర్తించడమే ఈ అనుమానాలకు కారణం. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు వారు ఆరోపిస్తున్నారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి