
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సంచలన మలుపు వద్ద నిలిచాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా అందరి కళ్లు తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నివాసంపైనే ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ వ్యక్తిగత జ్యోతిష్కుడు శ్రీ శ్రీ రాధన్ పండిట్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. టీవీకే విజయం సాధిస్తుందని, విజయ్ సీఎం అవుతారని రాధన్ గతంలోనే చెప్పారు. కేవలం కోరికతోనే కాకుండా జ్యోతిష్య గణనల ఆధారంగా టీవీకే ఈ ఎన్నికలలో 150కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్పై రాధన్ పండిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, జ్యోతిష్య గణనలు చెబుతున్న వాస్తవం” అని ఆయన అన్నారు. గతంలో 2021లో స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని, 2016లో జయలలిత గెలుస్తారని తాను చెప్పిన అంచనాలు నిజమయ్యాయని, అదే ట్రాక్ రికార్డ్తో ఇప్పుడు విజయ్ విజయం గురించి చెబుతున్నానని ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించారు.
విజయ్కు లభిస్తున్న ప్రజా మద్దతును ఆయన ఒక సునామీతో పోల్చారు. “సునామీ రాకను ఎవరైనా అంచనా వేయగలరు కానీ విజయ్కు వస్తున్న మద్దతు పరిమాణాన్ని లెక్కగట్టడం ఎవరి వల్ల కాదు. ఇది ఎన్నికల ఫలితాల తర్వాత అందరికీ అర్థమవుతుంది” అని గతంలో ఆయన చేసపిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. రాజ రాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వంటి గొప్ప చక్రవర్తులు జ్యోతిష్య సూత్రాలను పాటించి రాజ్యాలను పాలించారని, విజయ్ కూడా అదే బాటలో నడుస్తారని అన్నారు.
విజయ్ మురుగన్ స్వామికి గొప్ప భక్తుడని, ఆయన అధికారం చేపట్టిన తర్వాత తమిళనాడులోని దేవాలయాలను తిరుపతి స్థాయి అభివృద్ధి చేస్తారని పండిట్ వెల్లడించారు. ఎటువంటి మత పక్షపాతం లేకుండా అన్ని వర్గాల వారికి సేవలు అందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాధన్ పండిట్ సూచన మేరకే విజయ్ తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశ్వరూప దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ఫలితాల్లో టీవీకే దూసుకపోతుండడంతో రాధన్ పండిట్ బోకేతో విజయ్ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.