
మంగళవారం (మే 5, 2026) మధ్యాహ్నం చండీగఢ్లోని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ బయలుదేరిన ఇండిగో విమానం 6E 108 (HYD-IXC) లో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాలిలో ఉండగానే ఒక ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు గుర్తించారు.
విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో, ఒక ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ నుంచి హఠాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. నిమిషాల వ్యవధిలోనే క్యాబిన్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. పరిస్థితిని గమనించిన సదరు ప్రయాణికుడు వెంటనే విమాన సిబ్బందిని అప్రమత్తం చేశాడు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, అగ్నిమాపక పరికరాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, క్యాబిన్ నిండా పొగ ఉండటంతో ఊపిరాడక ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు.
విమానంలో మొత్తం 198 మంది ప్రయాణికులు, ఇద్దరు చిన్నారులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో విమానం చండీగఢ్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం ఆగగానే ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం సిబ్బంది అత్యవసర ద్వారాలను తెరిచారు. 3:35 గంటలకు ప్రయాణికులను స్లైడ్ల ద్వారా కిందికి దించారు. ఈ క్రమంలో 25F సీటులో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలి మడమకు గాయమైంది. కొంతమంది వృద్ధులతో సహా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ తక్షణ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే భారత వైమానిక దళానికి చెందిన అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే, విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో ముందే మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం కామెంట్ బాక్స్లోని లింక్ను క్లిక్ చేయండి..