Indian Railways: దేశంలోనే విషాదకరమైన రైలు.. క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్.. ఈ ట్రైన్ కథ తెలుసుకోవాల్సిందే!

భారతీయ రైల్వే నడిపే వేలాది రైళ్లలో ఒక రైలు పేరు మాత్రం హృదయ విదారకంగా ఉంటుంది. ప్రజలు దానిని క్యాన్సర్ రైలు అని పిలుస్తారు. కానీ, ఆ పేరు ప్రేమతో కాదు, బాధతో. ఈ రైలు పంజాబ్‌లోని బఠిండా స్టేషన్ నుండి ప్రతి రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతుంది. దీని గమ్యస్థానం రాజస్థాన్‌లోని బికనీర్. సుమారు 325 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి దాదాపు 8-9 గంటల సమయం పడుతుంది. కానీ, ఈ రైలులోని ప్రధాన ఆకర్షణ దాని ప్రయాణీకులే...వారిలో సగానికి పైగా క్యాన్సర్ రోగులే.

Indian Railways: దేశంలోనే విషాదకరమైన రైలు.. క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్.. ఈ ట్రైన్ కథ తెలుసుకోవాల్సిందే!
Cancer Express Train India

Updated on: May 24, 2026 | 4:10 PM

భారతీయ రైల్వేలో వేలాది రైళ్లు నడుస్తుంటాయి. కానీ, పంజాబ్, రాజస్థాన్ మధ్య నడిచే ఒక సాధారణ ప్యాసింజర్ రైలుకు (రైలు నంబర్ 14726) దేశంలో ఎక్కడా లేని ఒక విషాదకరమైన పేరు ఉంది. ప్రజలు దీనిని రైలు నంబర్‌తో కాకుండా క్యాన్సర్ రైలు (Cancer Train) అని పిలుస్తారు. పంజాబ్‌లోని బఠిండా నుండి రాజస్థాన్‌లోని బికానెర్‌కు ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు బయలుదేరే ఈ రైలు, ఆ ప్రాంతంలో నెలకొన్న భయానక ఆరోగ్య సంక్షోభానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రయాణించే వారిలో అధిక సంఖ్యలో క్యాన్సర్ రోగులే ఉంటారు. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, బాధితులకు ఆశాదీపంగా మారింది.

పచ్చని పంజాబ్‌లో క్యాన్సర్ మహమ్మారి:

పంజాబ్‌లోని మాల్వా ప్రాంతాన్ని దేశంలోనే క్యాన్సర్ బెల్ట్‌గా పిలుస్తారు. హరిత విప్లవం తర్వాత ఇక్కడి రైతులు పంటల దిగుబడి కోసం పురుగుల మందులు, రసాయన ఎరువులను మితిమీరి వాడారు. ఇవి క్రమంగా భూమిలోకి ఇంకిపోయి, తాగే నీటిని పూర్తిగా విషపూరితం చేశాయి. హ్యాండ్‌పంపుల ద్వారా వచ్చే కలుషిత నీటిని తాగడం వల్ల ఇక్కడి గ్రామాల్లోని ప్రతి ఇంటా ఒక క్యాన్సర్ బాధితుడు కనిపిస్తున్నాడు.

బికానెర్‌ వైపు రోగుల ప్రయాణం:

పంజాబ్‌లో క్యాన్సర్ వైద్యం అత్యంత ఖరీదైనది కావడంతో, పేద రోగులు రాజస్థాన్‌లోని బికానెర్‌లో ఉన్న ఆచార్య తులసి క్యాన్సర్ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారు. అక్కడ ప్రభుత్వ సబ్సిడీలతో పాటు చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స లభిస్తుంది. ఈ రైలులో ప్రయాణించే 60 శాతం మంది ప్రయాణికులు క్యాన్సర్ రోగులు లేదా వారి కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. కాగా, ప్రభుత్వం వీరికి ఉచిత లేదా రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

నిపుణులు, రాజకీయ నేతల ఆందోళన:

ఇటీవల పార్లమెంట్‌లోనూ ఈ క్యాన్సర్ రైలు ప్రస్తావన వచ్చింది. పంజాబ్‌లో కలుషిత నీరు పెద్ద సమస్యగా మారిందని, పంటల మార్పిడి ద్వారా నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలు కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, పర్యావరణ విధ్వంసం మానవ జీవితాలపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతుందో హెచ్చరించే ఒక సజీవ ఉదాహరణ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us