
ఈ నెల 22న పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధానికి తెగబడి, కశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది టూరిస్టులను అతి కిరాతకంగా కాల్చి చంపడంతో ఇండియా మొత్తం కోపంతో ఊగిపోయింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. వెంటనే భారత ప్రభుత్వం పాకిస్థాన్పై చర్యలు చేపట్టింది. సింధు జలాల నిలిపివేత, పాకిస్థాన్ పౌరులకు వీసాలు రద్దుచేయడం, భారత్లో ఉన్న పాక్ పౌరులను వెనక్కి పంపడం, పాక్ ఎంబసీని ఖాళీ చేయించడం, పాక్లో ఉన్న మన అధికారులను వెనక్కి రప్పించడం వంటి చర్యలు తీసుకుంది.
మరోవైపు ప్రతి చర్యగా పాకిస్థాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం వస్తుందంటూ ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్-పాక్ సరిహద్దుల్లో ఉన్న కశ్మీర్లోని ప్రజలు ప్రభుత్వం నిర్మించిన బంకర్లలో తలదాచుకునేందుకు.. ఆయా బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు.
జమ్మూ కశ్మీర్ లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న కర్మర్హా గ్రామ ప్రజలు భద్రత కోసం ప్రభుత్వం నిర్మించిన బంకర్లను శుభ్రం చేస్తున్నారు. ఒక వేళ యుద్ధం వస్తే.. సామాన్య పౌరులు ప్రాణాలు కాపాడుకునేలా భారత ప్రభుత్వం ఈ బంకర్లను నిర్మించింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్రతరం అవుతున్న క్రమంలో కొంతమంది ప్రజలు బంకర్లను ఓపెన్ చేసి.. అందులో ఉన్న వస్తువులను శుభ్రం చేసుకోవడం, అవసరమైన వస్తువులను సమకూర్చుకోవడం వంటివి చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి