
మన దేశంలో ప్రతిభకు కొదువ లేదు. కానీ మన పరిశోధనలు కేవలం పుస్తకాల్లోనో, సర్టిఫికేట్లలోనో ఉండిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చి, మన శాస్త్రవేత్తల ఆలోచనలను సామాన్యుడికి ఉపయోగపడే ఉత్పత్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఐఐటి మద్రాస్ టెక్నాలజీ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ ఇన్నోవేట్స్ వంటి కార్యక్రమాలు దేశ భవిష్యత్తును మార్చే ఒక బలమైన పునాదిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఒక కొత్త విషయం కనిపెడితే దానికి ఎన్ని పేటెంట్లు వచ్చాయి లేదా ఆ కంపెనీకి ఎన్ని కోట్లు వచ్చాయి అన్నదే చూస్తాం.. కానీ ఇప్పుడు ఆ పంథా మారాలని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి వంద ఏళ్లు పూర్తయ్యే నాటికి, ప్రపంచ దేశాలన్నీ ముఖ్యంగా వెనుకబడిన దేశాలు, మన అభివృద్ధి నమూనాను అనుసరించబోతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నవ భారత్ నిర్మించడం అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదు, వినూత్న ఆలోచనలతో కూడిన బలమైన వ్యవస్థను నిర్మించడమన్నారు. ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు కేవలం చదువుకే పరిమితం కాకుండా ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా కొత్త సాంకేతికతను రూపొందించాలి.
ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి సంక్లిష్టమైన డీప్ టెక్ రంగాలలో మన దేశం ముందంజలో ఉండటానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో తోడ్పడతాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన విద్యా సంస్థలను ఒకే చోటకు చేర్చి, ప్రపంచ స్థాయి వేదికను కల్పించడం ఈ సదస్సు ప్రత్యేకత అని చెప్పారు. ఇప్పటికే స్టార్టప్లకు పురిటిగడ్డగా ఉన్న ఐఐటి మద్రాస్, ఈ సామూహిక ప్రయత్నానికి నేతృత్వం వహించడం గర్వకారణమన్నారు.