Kanwar Yatra: ఉత్తరాదిన వైభవంగా కన్వర్ యాత్ర.. భక్తులపై డ్రోన్లతో పూల వర్షం
గుజరాత్లో కన్వర్ యాత్ర ఘనంగా జరిగింది. కన్వరియాలకు ఘనస్వాగతం పలికారు స్థానికులు. కన్వర్ యాత్రలో పాల్గొన్న భక్తులపై డ్రోన్లతో పూల వర్షం కురిపించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
![Kanwar Yatra: ఉత్తరాదిన వైభవంగా కన్వర్ యాత్ర.. భక్తులపై డ్రోన్లతో పూల వర్షం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kanwar-yatra.jpg?w=1280)
ఉత్తరాదిన కన్వర్ యాత్ర వైభవంగా సాగుతోంది. పరమశివుడికి ఇష్టమైన శ్రావణమాసంలో గంగా జలాన్ని తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లో కన్వర్యాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రావణమాసంలో కావడితో కాలినడకన గంగా జలాన్ని తీసుకొచ్చి తమ గ్రామాల్లోని శివాలయాలలో ఉన్న శివలింగానికి అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
కన్వర్ యాత్రలో భక్తులను కన్వరియాలు అంటారు. ఈ కన్వరియాలు కాషాయ దుస్తులు ఎంతో నియమనిష్టలతో.. గంగా నది నుంచి జలాన్ని తెచ్చి శ్రావణమాసంలో మాస శివరాత్రి త్రయోదశినాడు శివుడికి అభిషేకం నిర్వహిస్తారు. గుజరాత్ అహ్మదాబాద్లో నిర్వహించిన కన్వర్ యాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. వేలాదిగా వచ్చిన భక్తులపై డ్రోన్లతో పూల వర్షం కురిపించారు. అహ్మదాబాద్ అధికారులు.. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
యూపీలో జరిపిన కన్వర్ యాత్రలో హెలికాప్టర్లు.. బుల్డోజర్లతో.. పూల వర్షం కురిపించగా.. అహ్మదాబాద్లో డ్రోన్లతో పూలు చల్లి భక్తిని చాటుకున్నారు. ఏటా కన్వర్ యాత్రలో పాల్గొంటామని.. శివుడ్ని ఆరాధించేందుకు ఇదో పవిత్రమైన యాత్ర అంటున్నారు భక్తులు. గుజరాత్లో కన్వర్ యాత్రకు ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మరోవైపు కన్వర్ యాత్రలో పాల్గొనే భక్తులకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే దారి పొడవునా పూలతో వారికి స్వాగతం పలికారు.