
బీహార్ రాష్ట్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు హాస్పిటల్లో అంబులెన్స్ ఇవ్వక పోవడంతో ఒక కుటుంబం ఆమె మృతదేహాన్ని స్ట్రెచర్ పై పెట్టుకొని సుమారు రెండు కిలోమీటర్లు తోసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. హాస్పిటల్ సిబ్బంది తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అజయ్ సావో అనే వ్యక్తి తన తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను అక్బర్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అక్కడై హాస్పిటల్లో ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూనే ఆమె మరణించింది. దీంతో తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని అజయ్ హాస్పిటల్ సిబ్బందిని కోరాడు. కానీ అందుకు హాస్పిటల్ సిబ్బంది నిరాకరించినట్టు అతను ఆరోపించాడు. అంతేకాదు.. చనిపోయిన వారికి అంబులెన్స్ ఇవ్వరని సిబ్బంది చెప్పినట్టు ఆయన పేర్కొన్నాడు.
ఇక చేసేదేమి లేక కనీసం స్ట్రెచర్ అయిన ఇవ్వాలని.. తల్లి మృతదేహాన్ని దాని సహాయంతోనైనా ఇంటికి తీసుకెళ్తానని అజయ్ సిబ్బందని కోరాడు. కానీ అందుకు కూడా మొదట సిబ్బంది నిరాకరించారు.స్ట్రెచర్ కావాలంటే ఏదైనా హామీగా ఉంచాలని చెప్పారు. దీంతో అజయ్ తన భార్య, కుమారుడిని హాస్పిటల్ దగ్గరే హామీగా ఉంచి స్ట్రెచర్ను తీసుకెళ్లాడు. అలా తల్లి శవాన్ని స్ట్రెచర్పై ఇంటికి తీసుకెళ్లి మళ్లి దాన్ని తెచ్చి ఇట్టి భార్య, కుమారుడిని తీసుకెళ్లాడు.
అయితే ఈ ఘటనపై అతని బంధువులు మాట్లాడుతూ.. హాస్పిటల్ సిబ్బంది చాలా దారణంగా వ్యవహరించారని.. హాస్పిటల్లో అంబులెన్సులు ఉన్నప్పటికీ వాటిని ఇచ్చేందుకు వారు నిరాకరించారని ఆరోపించారు. ఆ తర్వాత కనీసం స్ట్రెచర్ అయినా ఇవ్వాలని వేడుకోగా.. తమలో ఇద్దరిని హామీదారులుగా అక్కడే ఉంచుకొని స్ట్రెచర్ ఇచ్చారని చెప్పారు.
అయితే అజయ్ తన తల్లి శవాన్ని స్ట్రెచర్పై తోసుకెళ్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది.ఈ వీడియో చూసిన జనాలు హాస్పిటల్ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై సంబంధిత హాస్పిటల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.