
మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో అర్ధరాత్రి వేళ దొంగల ముఠా ఏటీఎంను టార్గెట్ చేసి కేవలం 15 నిమిషాల్లో రూ.11 లక్షల నగదును ఎత్తుకెళ్లింది. నర్దానా పట్టణంలో శనివారం (ఆగస్టు 29) తెల్లవారుజామున 3 గంటల నుంచి 3.15 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దొంగల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు ముందుగా కారులో ఏటీఎం కియోస్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాపై పెయింట్ చల్లి నిఘా వ్యవస్థను పనిచేయకుండా చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మెషీన్లో నగదు నిల్వ చేసే బాక్స్ను అత్యంత చాకచక్యంతో కోశారు. నగదు తీసుకున్న వెంటనే అక్కడి నుంచి కారులో పరారయ్యారు.
ఏటీఎంలో అమర్చిన ఆటోమేటెడ్ అలర్ట్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున 3.20 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అనుమానితులు తెల్ల కారులో వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. ఏటీఎం మెషీన్ను కోసిన విధానం చూస్తే.. నిందితులకు యంత్రం అంతర్గత నిర్మాణంపై సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక అంతర్రాష్ట్ర ఏటీఎం దోపిడీ ముఠాల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
దొంగల కదలికలను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ధూలే, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బ్యాంకు అధికారులు ఏటీఎం నుంచి రూ.11 లక్షలు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో నిఘా, భద్రతా వ్యవస్థలున్నప్పటికీ నైపుణ్యం కలిగిన ముఠాలు ఏటీఎంలను ఎంత వేగంగా టార్గెట్ చేయగలవో మరోసారి స్పష్టమైంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..