
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బెంగళూరులో పర్యటించారు. అయితే.. ప్రధాని మోదీ పర్యటనకు కొద్ది గంటల ముందు బెంగళూరు శివార్లలో భారీ భద్రతా వైఫల్యం బయటపడటం కలకలం రేపింది. బెంగళూరు నగర పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించనున్న మార్గం సమీపంలో జిలిటిన్ స్టిక్స్ లభ్యం కావడంతో బెంగళూరులో భారీ భద్రతా హెచ్చరిక జారీ అయింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈవెంట్ వేదికకు వెళ్లే మార్గానికి సమీపంలో, కగ్గలిపుర ప్రాంతంలోని తాతగుణి వద్ద పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈలోగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వర్గాల సమాచారం ప్రకారం, హెచ్ఏఎల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ సమీపంలో పేలుళ్లు సంభవించవచ్చని హెచ్చరిస్తూ, అనుమానితుడు తెల్లవారుజామున స్థానిక పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయడంతో, కోరమంగళ సమీపంలోని ఒక ఇంటి నుండి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హెచ్చరిక తర్వాత, భద్రతా సంస్థలు ఆ రెండు ప్రదేశాలలో తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాయి.
హెచ్ఏఎల్ విమానాశ్రయం సమీపంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించనప్పటికీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు, ప్రధానమంత్రి ప్రయాణించే మార్గంలోని ఒక ప్రహరీ గోడ పక్కన ఉన్న వంతెన సమీపంలో జెలాటిన్ స్టిక్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)తో సహా ఉన్నతాధికారులు, పేలుడు పదార్థాలు ఆ ప్రదేశానికి ఎలా చేరాయి, వాటిని ఎవరు సరఫరా చేశారు.. వాటిని అక్కడ ఉంచమని ఎవరైనా అతనికి సూచించారా అనే విషయాలను నిర్ధారించడానికి అనుమానితుడిని విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితుడి తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారు.
గతంలో బెంగళూరుకు విఐపిలు వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి ఇలాంటి బెదిరింపు కాల్స్ చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. గతంలో అతడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, అతనికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పోలీసులు గుర్తించడంతో తర్వాత విడుదల చేశారు.
అయితే, హెచ్చరిక కాల్ వచ్చిన తర్వాత పేలుడు పదార్థాలు లభించడంతో, ఈసారి అధికారులు ఈ తాజా ఘటనను మరింత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆ మార్గం సమీపంలో రెండు జెలాటిన్ స్టిక్లను ఉద్దేశపూర్వకంగా విసిరి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఇతరుల ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను వ్యతిరేకించే వ్యక్తులతో ఈ పేలుడు పదార్థాలకు సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రధానమంత్రి పర్యటనకు ముందే ఈ పదార్థాన్ని గుర్తించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.