Crime News: టవల్తో కొడుకును దారుణంగా చంపిన తండ్రి.. సహకరించిన తమ్ముడు.. ఆ తర్వాత..
మదన్ కుమార్ మద్యం మత్తులో ఉండటంతో.. గొడవ అనంతరం నిద్రపోయి ఉంటాడని కుటుంబీకులు భావించారు. మధ్యాహ్నం వరకు లేవకపోవడంతో..
తమిళనాడులోని చెన్నైలో అత్యంత భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి తన కుమారుడిని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. మృతుడిని మదన్కుమార్గా గుర్తించారు. హత్యకు ముందు ఇంట్లో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. వివాదం ముదరడంతో తండ్రి పెద్దకుమారుడు మదనకుమార్ (24) ను గొంతు నులిమి హత్య చేశాడని.. అతనికి చిన్న కుమారుడు కూడా సహకరించాడని తెలిపారు. ఈ దారుణ ఘటన కాసిమేడులోని తిదీర్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తండ్రీ కొడుకులిద్దరినీ అరెస్ట్ చేశారు. చెన్నై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సి మతివానన్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మదన్ కుమార్ మద్యానికి బానిసై తరచూ గొడవపడేవాడు. ఈ సమయంలో మంగళవారం రాత్రి మదన్కుమార్ తన తండ్రిని మద్యం, గంజాయి కోసం డబ్బు అడిగాడు. అయితే అతని తండ్రి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. తర్వాత దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత గొడవ ముదరడంతో తండ్రి టవల్తో గొంతు పిసికి చంపాడు. అతనికి మృతుడి తమ్ముడు కూడా సహకరించాడు.
అయితే.. మదన్ కుమార్ మద్యం మత్తులో ఉండటంతో.. గొడవ అనంతరం నిద్రపోయి ఉంటాడని కుటుంబీకులు భావించారు. మధ్యాహ్నం వరకు లేవకపోవడంతో.. కుటుంబసభ్యులు చనిపోయాడని భావించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై మదనకుమార్ తల్లి పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న కాసిమేడు ఫిషింగ్ హార్బర్ పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మదన్ హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ హత్య కేసులో మతివానన్, అతని చిన్న కుమారుడు మాధవన్ (20) ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మదన్ తల్లి దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..