మహారాష్ట్రలో మళ్ళీ పెరిగిన కోవిడ్ కేసులు, ముంబై, థానే నగరాల్లోనూ అదే విలయం

| Edited By: Anil kumar poka

Apr 28, 2021 | 8:05 AM

మహారాష్ట్రలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరిగాయి. 24 గంటల్లో కొత్తగా 66,358 కేసులు నమోదయ్యాయి. 895 మంది మృతి చెందారు. ముంబై, థానే, పూణే లలో మొత్తం 6.72 లక్షల యాక్టివ్ కేసులు...

మహారాష్ట్రలో మళ్ళీ పెరిగిన కోవిడ్  కేసులు,   ముంబై, థానే  నగరాల్లోనూ అదే విలయం
80% of Mumbai already exposed to coronavirus
Follow us on

మహారాష్ట్రలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరిగాయి. 24 గంటల్లో కొత్తగా 66,358 కేసులు నమోదయ్యాయి. 895 మంది మృతి చెందారు. ముంబై, థానే, పూణే లలో మొత్తం 6.72 లక్షల యాక్టివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నాసిక్, నాగపూర్, ఔరంగాబాద్ జిల్లాలు కూడా పెరుగుతున్న కేసులతో తల్లడిల్లుతున్నాయి. ముంబైలో మంగళవారం 4 వేలకు పైగా కేసులు ఉండగా 59 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు వరుసగా ఐదో రోజు కూడా 13  శాతం ఉన్నట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. ఇక ఢిల్లీలో గత 24 గంటల్లో 24,149 కేసులు నమోదు కాగా 381 మంది రోగులు మరణించారు. పాజిటివిటీ రేటు 32.72 శాతం ఉంది. లాక్ డౌన్ విధించిన అనంతరం పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ.. నగరంలో ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో పడకల కొరత ప్రభుత్వాన్ని పీడిస్తూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సప్లయ్ ని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆక్సిజన్ ఉత్పత్తికి ఢోకా లేదని, కానీ తగినన్నిట్యాంకర్లు లేకపోవడం సమస్యగా మారిందని కేంద్రం వెల్లడించింది.

ఇలా ఉండగా థాయిలాండ్ నుంచి 18 క్రయోజెనిక్ ట్యాంకర్లను, ఫ్రాన్స్ నుంచి 21 ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్  తెలిపారు.కేంద్రం 5 ఆక్సిజన్ ట్యాంకర్లను అందజేసిందన్నారు. పరిస్థితిని అధిగమించేందుకు తాము శాయ శక్తులా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏమైనా నగరంలో వివిధ ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎస్ ఓ ఎస్ మెసేజులను పంపుతూనే ఉన్నాయి. కేంద్రం ఈ నగరానికి తగినంత ఆక్సిజన్ కోటాను నిర్దేశించినప్పటికీ ప్రభుత్వం వినియోగించుకోవడంలేదని కేంద్రం ఆరోపిస్తోంది.