
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉచిత విద్యుత్పై విజయ్ తొలి సంతకం చేశారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇకపై తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. అలాగే మహిళల భద్రతపై రెండో సంతకం చేశారు సీఎం విజయ్. ఇక తమిళనాట డ్రగ్స్ మహమ్మారిని అరకట్టేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేస్తూ సీఎం విజయ్ మరో సంతకం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చాలా కష్టాలు అనుభవించానని.. ఆకలి బాధలంటే ఏంటో తనకు తెలుసని విజయ్ అన్నారు. నేను మీ కుటుంబ సభ్యుడి లాంటి వాడినేనని.. సినిమాల్లో తనను ఉన్నతస్థాయిలో నిలిపారని విజయ్ అన్నారు. తమ్ముడూ రా అంటూ పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ చెప్పుకొచ్చారు. తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని..తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలే అండగా ఉన్నారన్నారు.
రాత్రికి రాత్రే ఏ అద్భుతాలూ చేయడానికి తానేమి దేవదూతని కాదని.. తాను అందరిలా సాధారణ మనిషినేనన్నారు. ఏది సాధ్యపడుతుందో అదే చెప్తాను, చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల కోట్ల అప్పులో ఉందని.. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని విజయ్ స్పష్టం చేశారు. తన పాలన అంతా పారదర్శకంగా ఉంటుందని.. ఇది మీ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో నేటి నుంచే డ్రగ్స్పై పోరాటం ప్రారంభమవుతుందన్నారు.
ప్రజా ధనాన్ని వృథా చేయను, దోచుకోనని విజయ్ చెప్పుకొచ్చారు. అహంకార ధోరణితో వెళ్లొద్దన్ని తన పార్టీ నేతలకు విజయ్ సూచించారు. తన ప్రభుత్వంలో తానే పవర్ సెంటర్ అని.. ఇంకో పవర్ సెంటర్ ఉండదన్నారు. మైనార్టీ ప్రజలకు తాను అండగా ఉంటానని.. విద్యార్థుల భవిష్యత్కు విజయ్ మామ అండగా ఉంటాడన్నాడు. పార్టీ కార్యకర్తల వల్లే ఈ విజయం వరించిందని.. వారికి రుణపడి ఉంటానన్నారు విజయ్. కొత్త శకానికి ఇది నాంది, లౌకిక, సామాజిక న్యాయం జరుగుతుందని విజయ్ చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.