
చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని, సరిహద్దులు కూడా దాటలేదని ప్రధాని మోదీ ప్రకటించారు.భారత భూభాగాన్ని వారు హస్తగతం చేసుకోలేదు.. అలాగే మన సైనికపోస్టును చేజిక్కించుకోలేదు అని స్పష్టం చేశారు. ఏది ఏమైనా… లదాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద చైనా జరిపిన దుశ్చర్యను దేశమంతా ఖండిస్తోందని, మన సైనికుల్లో 20 మంది అమరులయ్యారని, వారి త్యాగం వృధా కాదని ఆయన చెప్పారు. శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన మోదీ.. ‘భరత్ మాతా’ పై కన్నెత్తి చూసినవారికి మన దళాలు గుణపాఠం నేర్పాయని పేర్కొన్నారు. భారత దేశాన్ని రక్షించుకోవడానికి మన సైన్యం అన్ని ప్రయత్నాలూ చేస్తుంది.. ఏ అవకాశాన్నీ వదులుకోదు.. మన భూభాగంలో కనీసం ఒక్క అంగుళం భూమినైనా వదులుకునేందుకు మనం సిధ్ధంగా లేము అని మోదీ ప్రకటించారు. భారత సైన్యానికి పూర్తి అధికారాలిచ్చా మని, మన దేశం శాంతినే కోరుతోందని చెప్పిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటామన్నారు.
నూతన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారణంగా ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వద్ద భారత గస్తీదళాల సామర్థ్యం పెరిగిందని మోదీ చెప్పారు. గాల్వన్ వ్యాలీలో గత సోమవారం చైనా సైనికుల దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. వీరిలో కొందరు గాల్వన్ నదిలో పడిపోయారు. మేకులు గుచ్చిన చెక్కలు, ఇనుప తీగెలతో కూడిన రాడ్లతో చైనా దళాలు దాడికి దిగాయి. ఇంత పాశవిక చర్యను భారత మిత్ర దేశాలన్నీ ఖండించాయి. కాగా ఈ దాడుల్లో చైనా సైనికులు 45 మంది గాయపడడమో , మృతి చెందడమో జరిగిందని భారత సైన్యం చెబుతుండగా .. తమ వాళ్ళు 30 మంది మరణించారని చైనా ప్రకటించింది.