
ఇండోర్, ఆగస్ట్ 15: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రిటైర్డ్ జడ్జి జస్టిస్ రమేష్ గార్గ్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ముసుగులు ధరించిన ముగ్గురు సాయుధ దొంగలు రాత్రి పూట ఇంట్లో చొరబడి లక్షల రూపాయల నగదు, విలువైన బంగారు నగలను దోచుకెళ్లారు. అలారం మోగినప్పటికీ ముసుగులు ధరించి, చేతికి గ్లౌజులు ధరించి, ఇనుప రాడ్డుతో చొరబడిన దుండగులు దాదాపు 20 నిమిషాల పాటు ప్రశాంతంగా ఇంటిని దోచేశారు. ఇంత జరుగుతున్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ రమేష్ గార్గ్కి మాత్రం మెలకువ రాలేదు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చోరీ ఎంత పకడ్భందీగా జరిగిందో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది.
ఈ వీడియోలో ముగ్గురు దొంగలు కనిపిస్తారు. ఒక దొంగ జడ్జి బెడ్రూమ్లోకి ఇనుప రాడ్తో ప్రవేశించి, అతని వెనకే నిలబడి ఉండటం కనిపించింది. ఒకవేళ ఆయనకు మెలకువ వస్తే రాడ్డుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవ దొంగ గదిలోని బీరువాని ఇనుప రాడ్డుతో ఓపెన్ చేసి, అందులోని డబ్బు, బంగారం దోచుకోవడం వీడియోలో కనిపిస్తుంది. మూడవ దొంగ బయట కాపలాగా ఉన్నాడు. గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గార్గ్, అతని కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దొంగలు పారిపోయే వరకు జడ్జికిగానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ ఎవరీక తెలియలేదు.
3 criminals rohbed a retired Justice Ramesh Garg’s residence in Indore in just 4 minutes and 10 seconds and got away with Rs 5 lakh and gold-silver jewellery.
They would have killed Justice Garg’s son (in the video) if he had woken up. Fortunately, he kept sleeping despite the… pic.twitter.com/MTg8cJgaPQ
— Incognito (@Incognito_qfs) August 13, 2025
ఈ సంఘటన రక్షా బంధన్ రోజున జరిగింది. అదే రోజు సమీప ప్రాంతాలలో ఇలాంటి దోపిడీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అనేక ప్రదేశాల నుండి CCTV ఫుటేజ్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నీ వీడియోల్లో ముసుగులు, చేతి తొడుగులు ధరించిన నేరస్థులు ముఠాగా పనిచేస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఈ దోపిడీలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఉమాకాంత్ చౌదరి ధృవీకరించారు. నేరాల తీవ్రత దృష్ట్యా దొంగల ముఠాలను పట్టుకోవడానికి బహుళ బృందాలను ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. ఈ ముఠా గతంలోనూ ఇదే మాదిరి చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.పోలీసులు ప్రస్తుతం అనుమానితులను గుర్తించి ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను అరెస్టు చేసి కేసును త్వరలో ఛేదిస్తామని చౌదరి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.