
ముంబై మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ట్యూషన్ క్లాస్లో జరిగిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక మహిళా టీచర్ ప్రవర్తనతో ఒక చిన్నారి చేతులు తీవ్రంగా కాలిపోయాయి. హ్యాండ్రైటింగ్ సరిగా లేదనే కోపంతో ఆ టీచర్ ఓ విద్యార్థి చేతులు కాల్చి శిక్ష విధించింది. ఈ సంఘటన బుధవారం రాత్రి గోకులధామ్ ఫిలింసిటీ రోడ్డులో ఉన్న ట్యూషన్ సెంటర్లో జరిగింది. బాధితుడైన పిల్లవాడి వయసు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం నాలుగో తరగతిలో చదువుతున్నాడు.
టీచర్కు ఆ విద్యార్థి హ్యాండ్రైటింగ్ నచ్చకపోవడం వల్ల ఆమె కోపంతో క్యాండిల్తో ఆ విద్యార్థి చేతిపై ఉంచి కాల్చింది. ట్యూషన్ నుండి తిరిగివచ్చిన తర్వాత విద్యార్థి తన తల్లి వద్ద చేతిని చూపగా, రెండూ చేతులపై తీవ్రమైన కాలిన గాయాలు కనిపించాయి. తల్లి అడిగినప్పుడు విద్యార్థి ఏడుస్తూ, టీచర్ ఇలా క్యాండిల్తో కాల్చిందని చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
అనంతరం బాధిత బాలుడి తల్లి కురార్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది.. సదరు టీచర్ రాజశ్రీ రాథోడ్పై పోలీసులకు ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు విద్యార్థి నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..