Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఆరుగురు మృతి,

|

Sep 07, 2024 | 10:40 PM

మణిపూర్‌లో మళ్లీ భారీ హింస చెలరేగింది. బీర్బమ్‌ జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అరాచక శక్తులు డ్రోన్లు , రాకెట్లతో దాడులకు పాల్పడడం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలపై హెలికాప్టర్లతో నిఘా పెట్టింది కేంద్రం.

Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఆరుగురు మృతి,
Manipur Violence
Follow us on

మణిపూర్‌లో హింస మళ్లీ చెలరేగింది. తాజా అల్లర్లలో ఆరుగురు చనిపోయారు. . కొత్త తరహా దాడులతో రెచ్చిపోతున్నారు కుకీ తీవ్రవాదులు . డ్రోన్లు , రాకెట్‌ దాడులతో రాజధాని ఇంఫాల్‌ లోని ప్రముఖ నాయకుల ఇళ్లను వాళ్లు టార్గెట్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం యాంటీ డ్రోన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. కేంద్రం మణిపూర్‌లో తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది.

జీర్భమ్‌ జిల్లా హెడ్‌క్వార్ట్స్‌ సమీపంలో ఓ వ్యక్తిని కాల్చిచంపారు. వెంటనే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బిష్ణుపూర్‌ జిల్లాలో మాజీ సీఎం మైరమ్‌బమ్‌ కోరెన్‌సింగ్‌ ఇంటిపై ఉగ్రవాదులు రాకెట్‌ దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. తాజా అల్లర్లతో బీర్బమ్‌ తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు.

గత వారం రోజులగా కుకీ ఉగ్రవాదులు దాడులను రెట్టింపు చేశారు. రాకెట్లు , డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్నారు. ఇంఫాల్‌లో డ్రోన్‌ దాడులు తీవ్ర కలకలం రేపాయి. చుర్‌చందాపూర్‌లో ఉగ్రవాదులకు చెందిన మూడు బంకర్లను ఆర్మీ ధ్వంసం చేసింది. ఉగ్రవాదులు రాకెట్‌ దాడులకు ఈ బంకర్ల నుంచే స్కెచ్‌ గీసినట్టు గుర్తించారు. రాకెట్‌ దాడిలో ఓ వృద్దుడు చనిపోయాడు. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్లతో నిఘా పెట్టారు.

“ఆర్మీ ఛాపర్‌ను కూడా రంగం లోకి దింపాం.. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెట్టాం.. ఇరుపక్షాల మధ్య చాలా సేపు కాల్పులు జరిగిన తరువాత పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఇంఫాల్‌లో ఆయుధాలను లూటీ చేసేందుకు ప్రయత్నించారు. కాని భద్రతా దళాలు ఈ దాడిని తిప్పికొట్టాయి. అల్లరిమూకలను చెదరగొట్టాం.. ఈ ప్రయత్నంలో దుండగుల వాహనం కూడా ధ్వంసమయ్యింది. అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నాయి” మణిపూర్‌ ఇంటెలిజెన్స్‌ ఐజీ కబీబ్‌ తెలిపారు

కుకీ ఉగ్రవాదులకు విదేశాల నుంచి సాయం అందుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. డ్రోన్లు , రాకెట్‌లను వాళ్లు ప్రయోగించడం తీవ్ర కలకలం రేపుతోంది. కుకీ, మెయితీ తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా మణిపూర్‌లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. డ్రోన్‌ దాడులకు కుకీ తీవ్రవాదులే కారణమని మెయితీ వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదంటున్నారు కుకీ వర్గం ప్రజలు . మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పినప్పటికి కేంద్రం ఎందుకు రాష్ట్రపతి పాలన విధించడం లేదని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. సీఎం బీరెన్‌సింగ్‌ తీరు తోనే పరిస్థితి అదుపు తప్పిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..