
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అథిత్యం ఇస్తోన్న విషయం తెలిసింది. అయితే ఈ సమావేశానికి భారత్ రూపొందించిన లోగోలో తామరపువ్వు, నమస్కారం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారత జాతీయ పుష్పమైన తామరలోని 10 రేకులు 10 బ్రిక్స్ సభ్య దేశాలకు ప్రతీకగా నిలుస్తాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా రేకులను వివిధ రంగుల్లో రూపొందించారు. తామర మధ్యలోని నమస్కారం భారతీయ సంప్రదాయం, ఆతిథ్యం, స్నేహభావాన్ని సూచిస్తుంది. భౌగోళిక రాజకీయ అంశాల కంటే సహకారం, సంభాషణ, ఉమ్మడి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్న సందేశాన్ని లోగో ద్వారా భారత్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. 2012, 2016, 2021 తర్వాత భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. సెప్టెంబర్ 12,13 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
ఢిల్లీలో బ్రిక్స్ నేతలకు భారతీయ రుచుల విందు
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ప్రపంచ నేతలకు భారతీయ రుచులను పరిచయం చేసేందుకు ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లు ప్రత్యేక మెనూలను సిద్ధం చేశాయి. ది తాజ్ మహల్, ది లీలా ప్యాలెస్, ది లలిత్ హోటళ్లలో ప్రాంతీయ వంటకాలు, చిరుధాన్యాలతో తయారైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించనున్నారు. తాజ్ మహల్లో ట్రెడిషన్ టు టేబుల్ పేరుతో కాశ్మీరీ వాల్నట్లు, భకర్వాడి, మినీ కచోరీ, మురుక్కు వంటి వంటకాలు సిద్ధం చేశారు. లీలా ప్యాలెస్లో తామర ఆకారంలోని ప్రత్యేక మిఠాయి, మిల్లెట్ కుకీలు, గ్రానోలా బార్లు అందించనున్నారు. లలిత్లో భారతీయ సంప్రదాయ వంటకాలను ఆధునిక శైలిలో వడ్డించనున్నారు..
బ్రిక్స్ సదస్సుకు ఒకే బస్సులో వెళ్లనున్న మంత్రులు, సీఎంలు
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే బస్సులో భారత్ మండపానికి వెళ్లనున్నట్లు సమాచారం. సదస్సుకు బయలుదేరే ముందు నేతలంతా పార్లమెంట్ వద్ద సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి ఒకే బస్సులో సదస్సు వేదిక అయిన భారత్ మండపానికి చేరుకోనున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటం, వాహనాల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వీవీఐపీల రాకపోకల సమయంలో ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.