కరోనా వైరస్ గురించి భయం అనవసరం: ఈటల రాజేందర్
కరోనా వైరస్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, స్వైన్ఫ్లూతో పోలిస్తే కరోనా మరణాల శాతం చాలా తక్కువ అని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని రెలిపారు.
కరోనా వైరస్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, స్వైన్ఫ్లూతో పోలిస్తే కరోనా మరణాల శాతం చాలా తక్కువ అని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని తెలిపారు. హైదరాబాద్లో కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
కరోనా వచ్చిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా తగ్గిపోతుందన్నారు. ప్రజలు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే వైరస్ వ్యాపించదని తెలిపారు. కరోనా ఉన్న వారు మాట్లాడినపుడు ఆ తుంపర్లు ఇతరుల ముఖంపై పడితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందన్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్ను అరికట్టవచ్చని ఈటల చెప్పారు.
కాగా.. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నచోట కరోనా వైరస్ జీవించే ఆస్కారముంది. మన వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువ కనుక వైరస్ వచ్చే అవకాశం తక్కువ. ముందు జాగ్రత్త చర్యలుగా హోర్డింగ్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేపడుతున్నాం. దీనిపై 104 హెల్ప్లైన్ అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకిన వారిలో 3 శాతం కూడా మరణాలు లేవు. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినపుడు, దగ్గినపుడు టవల్ను అడ్డు పెట్టుకోవాలి. మిలిటరీ, చెస్ట్, ఫీవర్, వికారాబాద్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఈటెల స్పష్టంచేశారు.
తెలంగాణలోని వైద్య కళాశాలల్లో 600 నుంచి 800 పడకలు ఉన్నాయి. వాటిలో 200 పడకలు ఐసోలేషన్ కోసం వాడేలా చర్యలు తీసుకుంటున్నాం. మిగతా ఆస్పత్రుల్లో 3వేల పడకలకుపైగా వాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాం. 200 నుంచి 300 మందికి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొంతకాలం పాటు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు. అత్యంత ఆప్తులు కలిసినా నమస్కారం చేయండి. విదేశీ ప్రయాణాలకు వీలైనంత వరకు రాష్ట్ర ప్రజలు దూరంగా ఉండాలి. మాస్కులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం” అని మంత్రి ఈటల వివరించారు.