తప్పుడు ఆరోపణలు వద్దు.. ఆధారాలుంటే రుజువు చేయండి
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు
Sucharita on Babu allegations: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని బాబు, ప్రధానికి లేఖ రాశారని, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనడానికి ఏం ఆధారాలున్నాయని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్లంటూ వారి అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి, చానళ్లలో డిబేట్లు నడిపిస్తూ ప్రభుత్వంపై బాబు బురద జల్లుతున్నారని ఆమె విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఏవైనా ఆధారాలుంటే డీజీపీ ఫిర్యాదు చేయాలని, ఆయన విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటారని సుచరిత అన్నారు. గతంలో చంద్రబాబు ఇజ్రాయెల్ ప్రత్యేక టెక్నాలజీతో సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ను ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని తాము ఆధారాలతో సహా రుజువు చేశామని హోం మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం టీడీపీ చేస్తున్న ఆరోపణలను అదే తరహాలో నిరూపించాలని సవాల్ విసిరారు. కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులను పట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని.. ఇతరుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సుచరిత స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హోం మంత్రి వెల్లడించారు.
Read More:
ప్రభాస్ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్.. ‘ఆది పురుష్’గా రెబల్స్టార్