
ప్రపంచంలోని సప్త అద్భుతాలలో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ను మీరు రాత్రిపూట సందర్శించవచ్చు. ఈ సమయంలో అక్కడ రద్దీ ఉండదు. దానిని చూడటానికి మీకు పూర్తి 30 నిమిషాల సమయం లభిస్తుంది. ఈ క్షణంలోనే మీరు తాజ్ మహల్ను వెన్నెలలో చూస్తారు. ఆ వెలుగు వెండిలా తెల్లగా ఉన్నప్పటికీ, లేత నీలం లేదా ముత్యంలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రజలు ఈ దృశ్యం కోసం వారాల తరబడి ఎదురుచూస్తారు. కానీ, కొద్దిమంది మాత్రమే దీనిని చూడగలుగుతారు..ఎందుకంటే దీనిని చూసే అవకాశం నెలకు ఐదు రోజులు మాత్రమే లభిస్తుంది. అవును..వెన్నెల వెలుగుల్లో ప్రసిద్ధ తాజ్మహల్ను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం పౌర్ణమి రాత్రి వేళల్లో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది.
తాజ్మహల్ నైట్ వ్యూయింగ్ ప్రతి నెలా కేవలం ఐదు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పౌర్ణమి రోజుతో పాటు దానికి రెండు రోజుల ముందు, రెండు రోజుల తర్వాత ఈ అవకాశం ఉంటుంది. అయితే, ప్రతి శుక్రవారం తాజ్మహల్ మూసివేసి ఉంటుంది. కాబట్టి ఆ రోజు నైట్ వ్యూయింగ్ ఉండదు. అలాగే రంజాన్ మాసంలో కూడా రాత్రి సందర్శనను అనుమతించరు.
రాత్రి సందర్శన సమయం 8:30 PM నుండి అర్ధరాత్రి 12:30 AM వరకు ఉంటుంది. రాత్రివేళ రద్దీని నివారించడానికి పర్యాటకులను 8 బ్యాచ్లుగా విడదీస్తారు. ప్రతి బ్యాచ్కు 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఒక రోజుకు గరిష్టంగా 400 మంది పర్యాటకులను ప్రతి బ్యాచ్కు 50 మంది మాత్రమే అనుమతిస్తారు.
పగటిపూట సందర్శించే టికెట్లతో పోలిస్తే నైట్ వ్యూయింగ్ టికెట్ ధరలు వేరుగా ఉంటాయి:
భారతీయ పౌరులు (Adults): రూ.510
విదేశీ పర్యాటకులు (Foreigners): రూ.750
పిల్లలు (3 నుండి 15 సంవత్సరాల వరకు): రూ.500 భారతీయ, విదేశీ పిల్లలందరికీ వర్తిస్తుంది
ఆన్లైన్ బుకింగ్: నైట్ వ్యూయింగ్ టికెట్లను ఏఎస్ఐ అధికారిక వెబ్సైట్ (asi.paygov.org.in) ద్వారా సందర్శన తేదీకి 7 రోజుల ముందు నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పరిమితంగా ఉన్నందున ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది.
పర్యాటకులు తమకు కేటాయించిన సమయానికి కనీసం 30 నిమిషాల ముందే తూర్పు గేటు వద్దకు చేరుకుని సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకోవాలి. రాత్రి వేళ సెక్యూరిటీ అత్యంత కఠినంగా ఉంటుంది. మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలు, త్రిపాద్, అదనపు బ్యాటరీలను లోపలికి అనుమతించరు. కేవలం సాధారణ కెమెరాలను మాత్రమే అనుమతిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..