
నీతి కథలు కేవలం పిల్లల కోసం మాత్రమే కాదు. చిన్న కథ ద్వారా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, మంచి–చెడు మధ్య తేడా, నిర్ణయాల ప్రభావం వంటి విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా చేస్తాయి. జీవితంలో మంచి విలువలతో పాటు ఆలోచనా శక్తిని పెంచేందుకు, వ్యక్తిత్వ వికాసానికి ఈ నీతి కథలు దోహదపడుతాయి. కష్టకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఐకమత్యం విశిష్టతను తెలిపే ఓ నీతి కథను ఇక్కడ చూద్దాం..
అనగనగా ఒక అడవికి సమీపంలోని వెంకటాపురం అనే గ్రామంలో చాలా ఆవులు ఉండేవి. ప్రతిరోజూ అవన్నీ కలిసి అడవికి సమీపంలోని ప్రాంతాలకు వెళ్లి గడ్డి మేస్తూ ఉండేవి. అయితే అదే అడవిలో ఒక క్రూరమైన సింహం కూడా నివసించేది. ఆవులు ఒక్కొక్కటిగా ఒంటరిగా వెళ్లినప్పుడు వాటిపై దాడి చేసి, ఒకదాన్ని చంపి తినేది. దీంతో ఆవులు భయంతో జీవించాల్సి వచ్చేది.
ఒకరోజు ఆవులన్నీ సమావేశమయ్యాయి. తమ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించాయి. అప్పుడు ఓ తెలివైన ఆవు మాట్లాడుతూ.. “మనలో ప్రతి ఒక్కరం విడివిడిగా అడవిలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తున్నాం. అందుకే సింహం మనపై సులభంగా దాడి చేస్తోంది. మనమంతా ఎప్పుడూ కలిసే ఉంటే సింహం మనపై దాడి చేయడానికి భయపడుతుంది” అని చెప్పింది.
ఆవులన్నీ ఆ సలహాను అంగీకరించాయి. మరుసటి రోజు నుంచి అవి గడ్డి మేయడానికి వెళ్లినప్పుడు కూడా గుంపుగా కలిసి వెళ్లడం ప్రారంభించాయి. కొంతకాలానికి సింహం మళ్లీ ఆవులపై దాడి చేయడానికి వచ్చింది. అయితే ఈసారి ఆవులన్నీ ఒకచోట చేరి, సింహాన్ని చూసి భయపడకుండా దాని వైపు దూసుకెళ్లాయి.
అనేక ఆవులు తనపైకి కలిసి వస్తుండటాన్ని చూసిన సింహం భయపడిపోయింది. వాటిని ఎదుర్కోవడం తన వల్ల కాదని గ్రహించి అక్కడి నుంచి పరుగెత్తి పారిపోయింది. ఆ తర్వాత ఆవులు సంతోషంగా, ఎలాంటి భయం లేకుండా అడవిలో సంచరించాయి.
ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనపై దాడి చేయడానికి శత్రువులకు అవకాశం ఉంటుంది. కానీ మనమంతా ఐక్యంగా ఉంటే ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కుటుంబంలోనైనా, స్నేహితుల మధ్యనైనా, సమాజంలోనైనా పరస్పర సహకారం, ఐక్యత ఎంతో అవసరం. చిన్నవారైనా, పెద్దవారైనా కలిసి పనిచేస్తే కష్టమైన లక్ష్యాలను కూడా సాధించవచ్చు.
ఐక్యతలోనే బలం ఉంది. కలిసి ఉంటే ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు.