
“పిల్లలకు ఆటలు, చదువు ఉంటే చాలు.. వారికి డబ్బు గురించి చెప్పడం ఎందుకు?” అని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఆదాయం, ఖర్చులు, అప్పుల గురించి పిల్లల ముందు చర్చించడం వల్ల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడుతుంటారు. అయితే ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుతోంది. ఒత్తిడి కలిగించేలా కాకుండా, ఆడుతూ పాడుతూనే ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడం వారి భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. చిన్న వయసులోనే డబ్బు విలువ తెలియని పిల్లలు.. పెద్దయ్యాక విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మీ బిడ్డ రేపటి రోజున సగం కష్టాల నుంచి సులభంగా గట్టెక్కాలన్నా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలన్నా.. నేటి నుంచే మీరు కొన్ని పాఠాలు నేర్పాల్సి ఉంటుంది. పిల్లల్లో పొదుపు మంత్రాన్ని ఎలా నింపాలో, వారిని ఆర్థిక నిపుణులుగా ఎలా మార్చాలో తెలుసుకుందాం..
పిల్లలు ప్రతి విషయంలోనూ తమ తల్లిదండ్రులను అనుసరిస్తుంటారు. మీరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే, వారు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల ముందు మీ ఆర్థిక ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగేళ్ల వయసు నుంచే వారికి డబ్బు విలువ గురించి చెప్పడం మొదలుపెట్టాలి. పొదుపు చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలి. ఇలా చిన్నతనం నుంచే నేర్పిస్తే, కనీసం ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేసరికి వారు అనవసరమైన వస్తువుల కోసం మారాం చేయడం మానేస్తారు. ప్రతిదీ కొనివ్వాలని అడగకుండా, ఏది అవసరమో ఏది కాదో గుర్తించే స్థాయికి ఎదుగుతారు.
సాధారణంగా పిల్లలకు కష్టం అంటే ఏంటో తెలియదు కాబట్టి, తమకు నచ్చిన ప్రతి వస్తువును వెంటనే కొనివ్వాలని కోరుకుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు వారిని సరైన రీతిలో మోటివేట్ చేయాలి. అడిగిన ప్రతిదీ అవసరం లేకపోయినా కొనివ్వడం వల్ల వారికి డబ్బు విలువ తెలియదు. అవసరం లేని వస్తువును కొనుగోలు చేయకపోవడం వల్ల మిగిలే డబ్బుతో.. తర్వాత వారికి ఎంతగానో ఇష్టమైన సైకిల్, మంచి షూస్ లేదా స్కూల్ బ్యాగ్ ఎలా కొనుగోలు చేయవచ్చో వివరించాలి. దీనివల్ల వారిలో పొదుపు పట్ల ఆసక్తి కలగడమే కాకుండా, ఆర్థిక అవసరాల ప్రాధాన్యతను కూడా అర్థం చేసుకుంటారు.
పిల్లలు అనారోగ్యకరమైన చిరుతిళ్లు లేదా అవసరం లేని బొమ్మల కోసం డబ్బు వృధా చేయకుండా ఉండాలంటే, వారికి కిడ్డీ బ్యాంకులు కొనివ్వాలి. ప్రస్తుతం మార్కెట్లో ఆకర్షణీయమైన రంగుల్లో, బొమ్మల ఆకారంలో ఉండే పిగ్గీ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూడగానే పిల్లలకు అందులో డబ్బులు వేయాలనే ఉత్సాహం కలుగుతుంది. ప్రతిరోజూ మిగిలే చిల్లర నాణేలను అందులో వేయడం ఒక అలవాటుగా మార్చాలి. ఇలా చేస్తూ ఉంటే కొన్ని నెలల తర్వాత ఆ పిగ్గీ బ్యాంకులో గణనీయమైన మొత్తంలో డబ్బు పోగవుతుంది. ఆ డబ్బును వారి కళ్ల ముందే లెక్కించడం వల్ల వారికి కలిగే ఆనందం వర్ణనాతీతం.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పన్నెండేళ్ల లోపు పిల్లలు అనవసర ఖర్చులను తగ్గిస్తే ఏడాదికి కనీసం రూ. 10 వేల నుంచి రూ. 40 వేల వరకు ఆదా చేసే అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రతి సంవత్సరం స్కూల్స్ తెరిచే సమయంలో ఉపయోగిస్తే.. పుస్తకాలకు లేదా ఫస్ట్ టర్మ్ ఫీజులకు తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది. ఇది కేవలం పిల్లలకే కాదు, పేరెంట్స్ కు కూడా ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది. తమ పొదుపు డబ్బుతో తమ అవసరాలు తీరుతున్నాయని తెలిసినప్పుడు పిల్లల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరుగుతుంది. చిన్న మొత్తాల పొదుపే పెద్ద కష్టాల నుంచి కాపాడుతుందన్న సత్యాన్ని వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు. పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పడం అనేది వారికి ఇచ్చే అత్యుత్తమ ఆస్తి. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, దాన్ని నిర్వహించడం అంతకంటే ముఖ్యమని వారు తెలుసుకోవాలి.