
కదంబ చెట్టును కదం లేదా బర్ పువ్వుల చెట్టు అని కూడా పిలుస్తారు. ఇది మన దేశంతో పాటు ఆగ్నేయాసియాలో వేగంగా పెరుగుతుంది. ఈ చెట్టు గుండ్రని, మంచి వాసన ఉన్న పువ్వులు, విశాలమైన నీడతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ చెట్టు గురించి ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రాసలీలలు ఈ చెట్టు కింద ఆడాడని చెబుతారు. అందుకే ఇది ప్రేమ, భక్తి, ఆనందానికి గుర్తుగా మారింది. రాధా కృష్ణుల కలయికకు సాక్షిగా నిలిచినందువల్ల దీన్ని ప్రేమ వృక్షం అని కూడా పిలుస్తారు.
పురాతన సంస్కృత గ్రంథాలలో దుర్గాదేవికి కదంబ తోటలు ఇష్టమని రాసి ఉంది. అలాగే తమిళ సంప్రదాయాల్లో ఈ చెట్టును మురుగన్ స్వామితో ముడిపెడతారు. బౌద్ధ మతంలో కూడా ఇది జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు.
ఈ చెట్టు పసుపు రంగు పువ్వులను పూజలకు, సువాసనల తయారీకి, పూజా సామాగ్రిలో వాడుతుంటారు. ఆలయాల్లో ఈ చెట్టును పవిత్రంగా భావించి పూజిస్తారు.
కదంబ చెట్టు కేవలం పురాణాల్లోనే కాదు.. ఆయుర్వేదంలో కూడా ఒక మంచి ఔషధంగా వాడతారు. దీని బెరడు, ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది. దీనికి వెచ్చని, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు అనుకూలం. సారవంతమైన నేలలో ఇది బాగా పెరుగుతుంది. 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈ చెట్టు బాగా పెరుగుతుంది. ఈ చెట్టు సుమారు 45 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 4 నుంచి 5 ఏళ్లలో పూయడం మొదలుపెడుతుంది. దీనిని విత్తనాల ద్వారా లేదా కొమ్మలు నాటడం ద్వారా సులభంగా పెంచవచ్చు. కదంబ చెట్టు పవిత్రత, వైద్యం, ఆధ్యాత్మికం, అందం అన్నీ కలిగిన ఒక అద్భుతమైన చెట్టు.