
చాలామందికి ఉదయం నిద్ర లేవగానే దవడ నొప్పి లేదా పంటి నొప్పి వేధిస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం రాత్రిపూట తెలియకుండానే పళ్లు కొరకడం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 నుండి 36 శాతం మంది ప్రజలు రాత్రివేళల్లో రకరకాల ఆలోచనలు, ఒత్తిళ్లతో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సమస్యను ఎలా గుర్తించాలి, దీని నుండి దంతాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
మనం రాత్రిపూట ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచిస్తూ లేదా ఆందోళన చెందుతూ పడుకున్నప్పుడు, తెలియకుండానే పళ్లు పటపటా కొరుకుతుంటాము. ఈ నిరంతర రాపిడి వల్ల దంతాల పైన ఉండే ఎనామెల్ పొర దెబ్బతింటుంది. ఫలితంగా దంతాలు క్రమంగా బలహీనపడతాయి. ఉదయం లేవగానే దవడ దగ్గర పట్టేసినట్లు ఉండటం లేదా పంటి నొప్పిగా అనిపించడం వంటివి దీనికి ప్రధాన లక్షణాలు. దీనిని సకాలంలో గుర్తించకపోతే దంతాలు అరిగిపోయి, చిగుళ్ల సమస్యలకు కూడా దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడి కారణంగా పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు తమ దంతాలను రక్షించుకోవడానికి ‘మౌత్ గార్డ్’ వాడటం మంచిదని డెంటిస్ట్లు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు దీనిని ధరించడం వల్ల పై దంతాలు, కింది దంతాలు నేరుగా తగలకుండా ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. తద్వారా దంతాల మధ్య రాపిడి తగ్గి, అవి అరిగిపోకుండా కాపాడుకోవచ్చు.
ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారానే ఈ అలవాటును పూర్తిగా మానుకోవచ్చు. దీని కోసం నిపుణులు కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులను సిఫారసు చేస్తున్నారు.
ఆరోగ్యకరమైన దంతాలు ముఖారవిందానికే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకం. కాబట్టి ఒత్తిడిని దంతాల వరకు చేరనివ్వకుండా, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి