
అరటిపండును పేదల పోషకాహారంగా చెబుతుంటారు. తక్కువ ధరలో లభించే ఈ పండులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక అరటిపండు శరీరానికి సుమారు 112 క్యాలరీల తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో 1 గ్రాము ప్రొటీన్, 29 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 0.4 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, రాగి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు మెండుగా లభిస్తాయి. రోజూ ఒక అరటిపండు తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం.
హెల్త్లైన్ నివేదిక ప్రకారం.. అరటిపండ్లలో ఉండే కరిగే ఫైబర్ కడుపులోకి చేరాక జెల్ మాదిరిగా మారుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ చక్కెర త్వరగా రక్తంలో కలవకుండా నిరోధిస్తుంది. కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ.. ఈ ప్రత్యేక గుణం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. నీరసంగా అనిపించినప్పుడు అరటిపండు తింటే రక్తంలో చక్కెర సమతుల్యత దెబ్బతినకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
అరటిపండ్లలోని పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా పచ్చి అరటిపండ్లలోని రెసిస్టెంట్ స్టార్చ్ ప్రీబయోటిక్గా పనిచేస్తూ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. పండిన, పచ్చి పండ్లలో ఉండే ‘పెక్టిన్’ అనే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణనాళాన్ని శుభ్రపరుస్తుంది. పెక్టిన్ క్రమం తప్పకుండా శరీరానికి అందడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి అరటిపండు మంచి ఎంపిక. ఇందులో కేవలం 100 క్యాలరీలకు పైగా మాత్రమే శక్తి ఉన్నప్పటికీ, పోషకాలు నిండుగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇందులోని ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ ఆకలి కోరికలను ఎక్కువసేపు అణచివేస్తాయి. దీంతో అనవసరంగా జంక్ ఫుడ్ తినడం తగ్గి, బరువు తగ్గడం సులువవుతుంది.
ఒక అరటిపండు శరీరానికి కావాల్సిన రోజువారీ పొటాషియంలో దాదాపు 10 శాతాన్ని అందిస్తుంది. పొటాషియం రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఆహారంలో పొటాషియం తగినంత ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యల ముప్పు 25 శాతం వరకు తగ్గుతుంది. అరటిపండులోని మెగ్నీషియం గుండె లయను, రక్తనాళాల పనితీరును క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.
అరటిపండ్లలో ఫ్లేవనాయిడ్లు, అమైన్ల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడి, క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. అలాగే వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేసి కంటి చూపును మెరుగుపరుస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. అయితే తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడేవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారు వైద్యుల సలహా మేరకే పొటాషియం ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.