
ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించిన పండ్లలో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏ పండు తింటే ఏ రకమైన పోషకం అందుతుందో చాలామందికి తెలియదు. అందుకే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ప్రోటీన్ అనగానే మనకు మాంసం లేదా పప్పులు గుర్తుకొస్తాయి. కానీ ప్యాషన్ ఫ్రూట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర కణాల మరమ్మత్తుకు, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం ఎముకల బలానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది.
పనస పండులో పొటాషియం నిల్వలు అధికం. ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా కండరాల కదలికలను మెరుగుపరుస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఎముకలు, దంతాలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. బేరి పండ్లలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆక్సీకరణ ఒత్తిడి సర్వసాధారణం. చెర్రీస్లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్యాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అరటిపండును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించవచ్చు. ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం ఉత్తమం.
మందులు మింగడం కంటే ఇలాంటి పోషకాలు నిండిన పండ్లను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మీ అవసరానికి తగ్గట్టుగా సరైన పండును ఎంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి..
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.