
తిరుపతి లడ్డూ, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మాదిరిగానే, శబరిమల అయ్యప్ప స్వామి వారి అరవణ ప్రసాదం కూడా భక్తులందరికీ ఎంతో ఇష్టమైనది. టిన్లో ప్యాక్ చేసి పాకంలా ఉండే ఈ పాయసం రుచి అద్భుతం. ఈ ప్రసాదం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా నిపుణులు చెబుతుంటారు. మరి అంతటి రుచికరమైన అరవణ ప్రసాదాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే అచ్చం శబరిమలలో లభించే ప్రసాదం రుచి వస్తుంది.
కావలసిన పదార్థాలు:
రెడ్ రైస్ (ఎర్ర బియ్యం): 1 కప్పు
తాటి బెల్లం: 3 కప్పులు (సన్నగా తరిగింది)
ఎండుకొబ్బరి ముక్కలు: 2 టేబుల్స్పూన్లు
నల్ల ఎండు ద్రాక్ష: 2 టేబుల్స్పూన్లు
నెయ్యి: 4 టేబుల్స్పూన్లు (మధ్యమధ్యలో వేయడానికి)
శొంఠిపొడి: 1 టీస్పూన్
యాలకులపొడి: 1 టీస్పూన్
పచ్చకర్పూరం: కొద్దిగా
నీళ్లు: సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో రెడ్ రైస్ తీసుకుని రెండు మూడుసార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా పక్కన పెట్టండి.
స్టౌపై ఒక పాన్ పెట్టి, అందులో 2 టేబుల్స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. స్టౌ మీడియం ఫ్లేమ్లో ఉంచి, బియ్యాన్ని 5 నిమిషాల పాటు దోరగా, కమ్మటి వాసన వచ్చేవరకు వేయించండి.
బియ్యం తీసుకున్న కొలతతో మూడు కప్పుల వాటర్ రైస్లో పోయండి.
గిన్నెపై మూతపెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ, అన్నం పొడిపొడిగా అయ్యేవరకు వండండి. తర్వాత స్టౌ ఆఫ్ చేయండి.
ఇప్పుడు స్టౌపై బెల్లం కరిగించుకోవడం కోసం ఒక గిన్నె పెట్టి, ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుని, సన్నగా తరిగిన మూడు కప్పుల తాటి బెల్లం వేసుకోండి.
బెల్లం పూర్తిగా కరిగే వరకు స్టౌ మీడియం ఫ్లేమ్లో ఉంచి, గరిటెతో తిప్పుతూ ఉండండి.
ఇప్పుడు కరిగిన బెల్లం పాకాన్ని జాలి గరిటె సహాయంతో ఉడికించుకున్న రైస్లో పోసుకోవాలి.
స్టౌ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రైస్ను ఉడికించుకోవాలి. రైస్ అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
ప్రసాదం కాస్త చిక్కబడేటప్పుడు, ఎండుకొబ్బరి ముక్కలు, నల్ల ఎండు ద్రాక్ష వేసుకుని కలుపుకోవాలి.
తర్వాత మధ్యమధ్యలో కాస్త నెయ్యి వేసుకుంటూ, స్టౌ మీడియం ఫ్లేమ్లో ఉంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి.
చివరగా, శొంఠిపొడి, యాలకులపొడి, కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుని బాగా కలపాలి. ఆపై కొద్దిగా నెయ్యి వేసి, మరో 15 నిమిషాలు ఉడికించుకోండి.
స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
అంతే! ఇలా సులభంగా చేసుకుంటే, ఎంతో రుచికరమైన అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం తయారైపోతుంది. దీనిని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకుంటే నెల రోజులపాటు పాడవకుండా తినవచ్చు.