
బయట చిటపట వర్షం పడుతుంటే.. వేడి వేడిగా, కొత్తగా, రుచిగా ఏదైనా తినాలనిపిస్తుందా..? అయితే ఈసారి మీరు ఈ రెసిపీని పక్కాగా ట్రై చేయాల్సిందే.. మీకోసం ఓ ప్రత్యేకమైన, అదిరిపోయే క్రంచీ పాలకూర కట్ లెట్ రెసిపీని తీసుకొచ్చాను. ఇది ఆరోగ్యానికి మంచిది, పైగా తయారు చేయడం కూడా ఎంతో తేలిక. ఈ వర్షాకాలంలో వేడి వేడి టీతో కలిపి తింటే ఆహా.. ఏమి రుచి అనాల్సిందే..! తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
ముందుగా ఒక పాన్ లో 2 టీస్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేయాలి. అవి మెత్తగా అయ్యే వరకు వేయించాక, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ దశలో పాలకూరను వేసి పాన్ మూతపెట్టి చిన్న మంటపై మృదువుగా అయ్యే వరకు ఉడికించాలి. పాలకూర సరిగా ఉడికిన తర్వాత బంగాళాదుంప మిశ్రమం వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు వండి.. స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారనివ్వాలి.
చల్లారిన మిశ్రమాన్ని సమాన సైజుల్లో తీసుకుని గుండ్రంగా లేదా కట్ లెట్ ఆకారంలో తయారు చేయాలి. తయారు చేసిన ఒక్కో కట్ లెట్ ను మైదా నీటిలో ముంచి ఆ తర్వాత రస్క్ పొడితో కోటింగ్ చేయాలి. చివరిగా వేడి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
ఈ వేడి వేడి కట్ లెట్ ను టొమాటో సాస్ లేదా టీతో సర్వ్ చేయండి. ఇవి నూనె తక్కువగా ఉండి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా వీటిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు.