
వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యమవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు రైతులు అనుసరిస్తున్న బొప్పాయి ఆకుల చిట్కా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే క్రిమిసంహారిణిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. దీనికోసం ముందుగా 1 నుండి 2 కిలోల తాజా బొప్పాయి ఆకులను సేకరించాలి. ఈ ఆకులను చిన్న ముక్కలుగా కోసి, బాగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 5 నుండి 10 లీటర్ల నీటిలో కలపాలి.
ఈ ద్రావణాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసి, సుమారు 24 గంటల నుండి 48 గంటల పాటు నీడలో ఉంచాలి. మధ్యమధ్యలో ఒక కర్రతో కలుపుతూ ఉండాలి. నిర్ణీత సమయం తర్వాత, ఆ నీటిని పల్చటి గుడ్డతో వడకట్టాలి. ఇప్పుడు మీ ఆర్గానిక్ పెస్టిసైడ్ సిద్ధమైనట్లే.
తయారు చేసుకున్న ద్రావణాన్ని పంటపై స్ప్రే చేసే ముందు, దానికి మరికొంత నీటిని కలిపి పల్చగా చేయాలి. ఆకులకు బాగా అంటుకునేలా కొంచెం సబ్బు నీటిని లేదా సర్ఫ్ పొడిని కూడా కలుపుకోవచ్చు. దీనిని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్ప్రే చేయడం వల్ల ఆకు ముడత, తెగుళ్లు, చిన్న చిన్న పురుగులు నివారించబడతాయి.
ఇలా ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేసుకున్న ఈ పురుగు మందు వల్ల ప్రయోజనాలు కూడా బోలెడన్నీ ఉన్నాయి. ముఖ్యంగా దీంతో మార్కెట్లో దొరికే ఖరీదైన పురుగుల మందుల అవసరం ఉండదు. ఇది మట్టిని, పర్యావరణాన్ని పాడు చేయదు. రసాయనాలు లేని పంటలు పండించడం వల్ల వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతినదు. బొప్పాయి ఆకులలోని పోషకాలు మొక్కల పెరుగుదలకు కూడా తోడ్పడతాయి. ప్రకృతిలో మనకు అందుబాటులో ఉండే వనరులతోనే మేలైన వ్యవసాయం చేయవచ్చని ఈ బొప్పాయి ఆకుల చిట్కా నిరూపిస్తోంది. చిన్న రైతులు, పెరటి తోటలు పెంచే వారు ఈ పద్ధతిని పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.