
నోటి ఆరోగ్యం కాపాడుకోవడం అనేది మన నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైన అలవాటు. అయితే పళ్లు తోముకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని ఏ సమయంలో చేయాలనేది కూడా చాలా ముఖ్యం. ఈ విషయంపై చాలా మందికి సరైన అవగాహన లేదు. ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకోవడం మనందరి అలవాటు. కానీ అసలు అల్పాహారానికి ముందు తోముకోవాలా లేక తర్వాతా చేసుకోవాలా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంటుంది. ఈ విషయంపై దంతవైద్యురాలు డాక్టర్ మిచెల్ జోర్గెన్సన్ కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.
క్లినికల్గా అల్పాహారానికి ముందే పళ్లు తోముకోవాలని గట్టిగా సిఫార్సు లేనప్పటికీ.. దీన్ని ఆరోగ్యకరమైన దినచర్యగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేవగానే తోముకోవడం మేలు: డాక్టర్ మైఖేల్ ప్రకారం.. రాత్రంతా నిద్రపోయిన తర్వాత మన దంతాలపై చేరిన బ్యాక్టీరియా, ఇతర హానికరమైన సూక్ష్మక్రిములను తగ్గించడానికి భోజనానికి ముందు పళ్లు తోముకోవడం అనేది ఉత్తమ మార్గం.
బ్యాక్టీరియా తగ్గించే అవకాశం: మీరు తిన్న తర్వాత పళ్లు తోముకుంటే రాత్రంతా నోటిలో చేరిన ఈ సూక్ష్మక్రిములు ఆహారంతో పాటు మీ లోపలికి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేయడం ఉత్తమం.
ఒకవేళ మీరు అల్పాహారం తీసుకున్న తర్వాతే పళ్లు తోముకోవాలని భావిస్తే, దానికి ఒక నియమం పాటించాలి.
30 నిమిషాల విరామం: మీరు భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత మాత్రమే పళ్లు తోముకోవాలి.
ఆమ్ల ఆహారాలు జాగ్రత్త: ముఖ్యంగా మీరు నిమ్మరసం, పండ్లు లేదా రసాలు వంటి ఆమ్ల స్వభావం ఉన్న ఆహారాలు తిన్నట్లయితే, వెంటనే బ్రష్ చేయకూడదు. ఎందుకంటే ఆమ్లాలు దంతాల ఎనామిల్ను బలహీనపరుస్తాయి. వెంటనే బ్రష్ చేయడం వల్ల దంతాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది.
దంతాలపై చేరిన బ్యాక్టీరియాను 12 గంటల్లోపు తొలగించకపోతే, అవి దంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మంచి దంత ఆరోగ్యం కోసం కేవలం పళ్లు తోముకోవడమే కాకుండా క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం వల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి