మానవత్వం సిగ్గుపడుతోంది. మానవ రూపంలోని మృగాలు రెచ్చిపోతున్నాయి. సభ్యసమాజం తలదించుకునే మరో ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ముక్కు పచ్చలారని ఓ పసిబిడ్డను కిరాతకులు చిదిమేశారు. కామాంధులు ఆ బిడ్డపై లైంగిక దాడికి పాల్పడి, గొంతు నులిమి చంపారు. ఈ దారుణ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లఖింపూర్ ఖేరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటూ బుధవారం అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం గాలించారు. కాగా, గురువారం ఉదయం గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో బిడ్డ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. అయితే, చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు.
పాతకక్షల కారణంగానే తన బిడ్డను కిడ్నాప్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మృతురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. లఖింపూర్ఖేరీ జిల్లాలో గత 20 రోజుల్లో ఈ అత్యాచార ఘటన మూడోది.
ఓ 17 ఏళ్ల యువతి స్కాలర్షిప్ దరఖాస్తు కోసం వెళ్లగా, ఆమెపై కొందరు దుండగులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి హతమార్చారు. మరో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. ఈ వరుస ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.