ఢిల్లీలో మూడో కోవిడ్-19 వేవ్ మొదలైనట్టు కనిపిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. ఒక్క రోజులో నగరంలో కొత్తగా 5,673 కేసులు నమోదు కావడమే ఇందుకు కారణమన్నారు. అయితే మూడో వేవ్ ప్రారంభమైందా అన్న విషయమై నిర్దిష్టంగా ఇప్పుడే చెప్పలేమని, మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉందని ఆయన చెప్పారు. ఏమైనా థర్డ్ వేవ్ కి అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గత వారం రోజులుగా ఈ నగరంలో రోజూ సగటున సుమారు 4 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆ మధ్య ఈ మహమ్మారి కొంత తగ్గినట్టు కనిపించినప్పటికీ..మళ్ళీ గత సోమవారం మొదటిసారిగా ఒక్కరోజులో 4,800 కి పైగా కేసులు రిజిస్టరయినట్టు జైన్ చెప్పారు. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే అని పేర్కొన్నారు. బహుశా ఈ పండుగల సీజనే ఇందుకు కారణమని భావిస్తున్నట్టు సత్యేంద్ర జైన్ చెప్పారు. అయితే మునుపటికన్నా ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఓ కుటుంబంలో ఏ ఒక్కరికి ఇన్ఫెక్షన్ సోకినా ఆ కుటుంబ సభ్యులందరికీ టెస్టింగులు చేయిస్తున్నామని ఆయన వివరించారు.