
సెప్టెంబర్ 7 నుంచి మొదలు కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శుక్రవారం అసెంబ్లీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి డిఫ్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ విప్లు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సమావేశాలు జరుగుతున్నందున అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు.
మరోవైపు, అసెంబ్లీ కమిటీ హాల్లో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో అసెంబ్లీ నిర్వహణపై చర్చించారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ శాఖల నుంచి రావాల్సిన ఇన్పుట్స్పై సమీక్ష జరిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా అనుమతిపై, మంత్రులు ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బందిని అనుమతించడంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యేలు మధ్య భౌతిక దూరం పాటించడంతోపాటు శానిటైజ్ చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.