
రాజ్యసభలో ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు దేశీయ విమాన సర్వీసులకు తీర్చిదిద్దామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి తెలిపారు. రాజ్యసభలో ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లు గురించి మాట్లాడుతూ.. గత మూడేళ్లలో వెయ్యి మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను రిక్రూట్ చేశామన్నారు. అయితే ఖాళీలు మాత్రం 3,500 ఉన్నట్లు స్పష్టం చేశారు. స్పష్టం చేశారు. కొవిడ్ ప్రభావంతో ప్రస్తుతం రిక్రూట్మెంట్ ప్రక్రియ మందగించిందన్నారు.
దేశంలో విమానయాన రంగం ప్రైవేటీకరణ వల్ల వచ్చిన 29వేల కోట్లను విమానాశ్రయాల అభివృద్ధికి వాడనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. విమానయాన రంగ రక్షణ విషయంలో ఎటువంటి లాలూచీ జరగలేదన్నారు. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు 2006లో ప్రైవేటుపరం చేశారని, ప్రస్తుతం ఎయిర్పోర్ట్లు 33 శాతం రాకపోకలు పెరిగాయని, అంతేస్థాయిలో ఆదాయం కూడా పెరిగిందన్నారు. అయితే 2018లో ప్రైవేటీకరణ చేసిన ఆరు విమానాశ్రయాలతో కేవలం 9 శాతం ఆదాయం వస్తుందన్నారు. ఆ విమానాశ్రయాల కోసం ఓపెన్ బిడ్డింగ్కు వెళ్లినట్లు చెప్పారు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణకు కేరళ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వలేదన్నారు.
సామాన్యుడికి కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘటన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదేనన్న మంత్రి హరిదీప్.. వందేభారత్ మిషన్ ద్వారా 16 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం తొలి రోజు 36 లక్షల మంది ఎయిర్ ఇండియా వెబ్సైట్ను విజిట్ చేసినట్లు చెప్పారు. విమాన టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని లేదంటే మూసివేయాల్సి వస్తుందన్నారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్ తర్వాత ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.