
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్డిఎ కూటమి భాగస్వామి రాంవిలాస్ పాశ్వాన్ హఠాన్మరణంతో కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేశారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అదనపు బాధ్యతలు అప్పగించారు. వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా సరఫరా మంత్రిత్వశాఖ బాధ్యతలను గోయల్కు కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా ప్రకారం, కేబినెట్ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, తన ప్రస్తుత శాఖలతో పాటు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారని రాష్ట్రపతి భవన్ శుక్రవారం తెలిపింది.
దేశంలో అత్యంత శక్తిమంతమైన దళిత నాయకుడిగా ఎదిగిన రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇటీవల గుండెకు ఆపరేషన్ చేయించుకొన్న ఆయన.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, లోక్సభ సభ్యుడు చిరాగ్ పాసవాన్ ట్విటర్ ద్వారా తెలిపారు. దాదాపు 50 ఏళ్ల పాశ్వాన్ దేశ రాజకీయాల్లో తన మార్క్ చూపించారు. రాంవిలాస్ మృతికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.