లాక్‌డౌన్ బేఖాతర్.. తెలంగాణ వ్యాప్తంగా రెండు లక్షల వాహనాలు సీజ్‌..

| Edited By:

Apr 28, 2020 | 5:55 PM

కరోనా వైరస్‌పై ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు, మీడియా, కళాకారులు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండండంటూ విన్నవించుకుంటున్నారు.

లాక్‌డౌన్ బేఖాతర్.. తెలంగాణ వ్యాప్తంగా రెండు లక్షల వాహనాలు సీజ్‌..
Follow us on

కరోనా వైరస్‌పై ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు, మీడియా, కళాకారులు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండండంటూ విన్నవించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు చేసుకుంటేనే కరోనాను తరిమేయగలమని చెబుతున్నారు. అయినప్పటికీ చాలా మందికి కరోనావైరస్‌ తీవ్రత తెలియడం లేదు.. లాక్‌డౌన్‌ ప్రాధాన్యతనూ అర్ధం చేసుకోవడం లేదు. ఎప్పటి మాదిరిగానే యధేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. అవసరం లేకున్నా సరదాగా తిరుగుదాం అనుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారే రోడ్లపై దర్శనమిస్తున్నారు.

ఒకరు ఆశీర్వాద్‌ ఆటా కోసమని, మరొకరు మునక్కాయల కోసం అంటూ వస్తూ.. అడ్డంగా బుక్కవుతున్నా మార్పు రావడం లేదు. పోలీసులు ఎంత చెబుతున్నా వినిపించుకోవడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల వాహనాలను సీజ్‌ చేయగా.. మొత్తంగా 5 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనే 65వేలకుపైగా వాహనాలను సీజ్ చేశారు. ఎపిడమిక్‌ యాక్ట్‌తో పాటు ఇతరత్రా సెక్షన్ల కింద కేసులను నమోదు చేసిన పోలీసులు.. వాహనాలను అప్పడే తిరిగి ఇచ్చే ప్రస్తకి లేదని చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత సీజ్ చేసిన వాహానాలను కోర్టుకు సమర్పిస్తామని.. ఆదేశాలనుసారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడమే కాదు.. కరోనా వ్యాప్తిని కారకులుగా మారుతున్నారు. కనీసం భౌతికదూరం కూడా పాటించడం లేదు. మే 7 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగనుండగా.. సీజ్ అయిన వాహనాలను తీసుకోవాలంటే కోర్టుకు హాజరుకాక తప్పదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సీజ్‌ అయిన వాహనాలను తీసుకోవాలంటే.. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు నెలల సమయం పట్టొచ్చని అంటున్నారు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత…పోలీసులు కోర్టుల్లో ఛార్జీషీట్లను దాఖలు చేస్తారు. కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా…ఉల్లంఘన దారులకు ఫైన్, జైలు శిక్ష విధించే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.

అత్యవసర విధులు నిర్వహించే వారికి పాసులు జారీ చేశారు. కొందరు ఆ పాసులను కూడ దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తించి కొన్నిటిని రద్దు కూడా చేశారు. . ఎమర్జెన్సీ వాహనాలు తప్ప మిగిలిన ఏ వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అనుమతించడం లేదు. జంటనగరాల్లో సుమారు లక్ష టూవీలర్ వాహనాలను సీజ్ చేశారు. ఐదు వేల వరకు త్రివీలర్, నాలుగు వేల ఫోర్ వీలర్ వాహనాలను సీజ్ చేశారు. హైదరాబాద్‌ పరిధిలో పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. రూల్స్‌ బ్రేక్‌ చేసిన వారు తమ వాహనాలను తీసుకోవాలంటే కోర్డుకు వెళ్లే విడిపించుకోవాల్సి ఉంటుంది.

ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే రకమైన నిబంధనలే ఉన్నాయి. మొన్నటి వరకు 3 కిలోమీటర్ల పరిధిలో చూసీ చూడనట్టు వ్యవహరించిన పోలీసులు.. వారం రోజులుగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన కారణం ఉంటే తప్ప వదలడం లేదు. ఆధార్‌ కార్డు చిరునామా ఆధారంగా వాహనాలను సీజ్‌ చేశారు. ఇప్పటికైనా అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి వస్తే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది.