
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనితో ఇప్పటికే అనంతపురం, ఒంగోలు వంటి ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ ప్రకటించగా.. ఇప్పుడు ఇదే కోవలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రకటించారు. రాజమండ్రి, కాకినాడతో పాటుగా జిల్లాలోని ఇతర పట్టణాలు, మండలాల్లో కూడా కరోనా కేసులు విస్తరిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ముందుగా అమలాపురం, అయినవిల్లి మండలాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేసి.. జిల్లా వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లలో ఈ నెల 25 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మద్యం షాపులు, కూరగాయాల షాపులు తెరవాలని సూచించారు. ఇక బయటికి వచ్చేవారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలన్నారు. ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తే రూ. 500 జరిమానా విదిస్తామన్నారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 760 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.