స్టూడెంట్‌తో లెక్చరర్ రెండో పెళ్లి.. భరించలేక మొదటి భార్య ఆత్మహత్య

|

Oct 12, 2020 | 4:12 PM

పాఠాలు చెప్పే పంతులే పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. ఆపై సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని.. భార్యను వేధించడం మొదలు పెట్టాడు.. భర్త టార్చర్ భరించలేక ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది.

స్టూడెంట్‌తో లెక్చరర్ రెండో పెళ్లి.. భరించలేక మొదటి భార్య ఆత్మహత్య
Follow us on

పాఠాలు చెప్పే పంతులే పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. ఆపై సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని.. భార్యను వేధించడం మొదలు పెట్టాడు.. భర్త టార్చర్ భరించలేక ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. నంధ్యాల పట్టణంలో వివాహిత అనుమానాస్పదస్ధితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసలుు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన గండ్ర పుల్లయ్య వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన కీర్తి (33)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విద్యావంతులు కావటంతో పెళ్లి అనంతరం ఉద్యోగం కోసం నంద్యాల పట్టణానికి వచ్చి ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్నారు. స్థానిక నాగార్జున ప్రైవేట్‌ కళాశాలలో పుల్లయ్య లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుండగా, గుడ్‌షెప్పర్డ్‌ స్కూల్‌లో ఉపాధ్యాయురాలుగా కీర్తి ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. సంతోషంగా సాగుతున్న వీరి సంసార జీవితంలో పరాయి స్త్రీ చిచ్చుపెట్టింది.

అయితే, పుల్లయ్య నాగార్జున కాలేజీలో పనిచేస్తున్న సమయంలో అదే కాలేజీలో చదువుకున్న సుభాషిణితో పరిచయం ఏర్పడింది. కాగా, ప్రస్తుతం నంద్యాల ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్‌ క్లర్క్‌గా సుభాషిణి పనిచేస్తోంది. ఈ యువతి పుల్లయ్య స్టూడెంట్‌ కావడం.. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ప్రశాంతంగా సాగిపోతున్న వారి ఫ్యామిలీలో ఒక్కసారిగా చిచ్చేరేగింది. ఈ విషయంలో పుల్లయ్య, కీర్తి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇదే క్రమంలో నాలుగు నెలల క్రితం ఎవరికి తెలియకుండా సుభాషిణిని రెండో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు, ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను కీర్తి సెల్‌కు పంపి వేధించడం మొదలు పెట్టారు. తమకు అడ్డుగా ఉన్నావంటూ సుభాషిణి తరచూ ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టడం, మరోవైపు భర్త కూడా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో కీర్తి తీవ్ర మనస్థాపానికి గురైంది. జీవితంపై విరక్తి చెందిన కీర్తి శనివారం అర్థరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

కీర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేస్తూ పుల్లయ్యకు దేహశుద్ధి చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో భార్య సుభాషిణి కూడా ఇంటికి తాళం వేసి పారిపోయింది. కాగా, తన కుమార్తె చావుకు అల్లుడు, అతని రెండో భార్య సుభాషిణే కారణమని మృతురాలి తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.