ఈరోజు రాత్రి నుంచి జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా మూతపడనుంది. ఇవాళ రాత్రి 10.30 గంటలకు చివరి విమానం ఎగరనుంది. రోజువారి నిర్వహణకు కూడా నిధులు లేకపోవడంతో కంపెనీ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తోంది. జెట్ ఎయిర్వేస్కు రూ.8వేల కోట్ల రుణాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రుణాలు తీర్చడం కోసం కొద్దిసేపటి క్రితం వరకు కంపెనీ నిధులు కోసం ప్రయత్నించింది. ఇక ఫలితం లేకపోవడంతో నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి కేవలం 35 నుంచి 40 సర్వీసులు నడుపుతున్నా… సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కంపెనీ నష్టాల నుంచి బయటపడడానికి తక్షణం రూ. 400 కోట్లు సాయం అందించాలని సీఈఓ వినయ్ దూబే బ్యాంకులను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. కాగా రుణాలు ఇవ్వడం కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకు వచ్చినా… ప్రైవేట్ బ్యాంకులు ససేమిరా అనడంతో జెట్ సర్వీసులు ఆగిపోయాయి.