Jallikattu begins in Madurai: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాలను అంటుతున్నాయి. తమ తమ సంస్కృతీ, సంప్రదాయాలను అనుసరిస్తూ ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు. తాజాగా తమిళ సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సందర్భంగా జరిగే జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు చూసేందుకు ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈ పోటీలో ఎంతో ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. తాజాగా మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. 14 న అవనీయపురం, 15న పాలమేడు , 16న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలాంగనల్లూర్లో జల్లికట్టు పోటీలు జరగనున్నాయి. అవనీయపురం జల్లికట్టు పోటీలలో 700 ఎద్దులు, 300 మంది వీరులు పోటీలో పాల్గొంటున్నారు. రేపు పలమేడులో 650 ఎద్దులతో జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. పోటీ జరిగే ప్రాంతంలో 10 ప్రత్యేక వైద్య బృందాలను అధికారులు అందుబాటులో ఉంచారు. ఎవరైనా జల్లికట్టులో గాయపడితే వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించేందుకు ముందుజాగ్రత్తగా జల్లికట్టు పోటీలు జరుగుతున్న ప్రదేశంలో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు.
అవనీయపురం జల్లికట్టు పోటీలను వీక్షించడానికి కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ మదురై రానున్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఈసారి జల్లికట్టు వేడుకలు చూసేందుకు తమిళనాడు రానున్నారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ నేతల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 16న అలాంగనల్లూర్లో జరగనున్న జల్లికట్టు పోటీలు సీఎం పళనిస్వామి ప్రారంభిస్తారు.
జల్లికట్టు పోటీలు చాలా భయంకరంగా సాగుతాయన్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా వదిలిన బలమైన ఎడ్లను.. పోటీలో పాల్గొనే వారు వాటి కొమ్ములను పట్టుకొని లొంగదీసుకోవాలి. ఈ సమయంలో చాలా మంది గాయాలపాలవుతారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన ఘటనలూ కూడా ఉన్నాయి. ఈ ప్రమాదకర ఆటలకు స్వస్తి చెప్పాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించినా.. జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమని తమిళులంతా ఏకమై.. తీవ్ర ఆందోళనలు చేశారు. ప్రజలకు సినీతారలు, రాజకీయ నాయకులు సైతం మద్దతు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు తమ ఆదేశాన్ని కొన్ని షరతులతో ఉపసంహరించుకుంది.
Also Read: కోడిపందాలపై నిషేధమున్నా.. బరిలోకి దిగిన పందెం కోడి.. కాయ్ రాజా కాయ్..