హౌడీ మోదీ: ట్రంప్ మోదీల కలయిక… ప్రవాస భారతీయులకు లాభమా?
అయిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో అడుగు పెట్టినప్పుడు.. న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద లభించిన ఘన స్వాగతం ఆయన విజయాన్ని ప్రతిబింబించింది. రెండోసారి కూడా ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తరువాత ఇప్పుడు మళ్లీ మోదీ అమెరికాలో అంతకంటే పెద్దసంఖ్యలో అభిమానులనుద్దేశించి మాట్లాడబోతున్నారు. సెప్టెంబర్ 22 న ఆదివారం హ్యూస్టన్లో నిర్వహించే ఈవెంట్లో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటున్నారు. ఇటీవల కశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ […]
అయిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో అడుగు పెట్టినప్పుడు.. న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద లభించిన ఘన స్వాగతం ఆయన విజయాన్ని ప్రతిబింబించింది. రెండోసారి కూడా ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తరువాత ఇప్పుడు మళ్లీ మోదీ అమెరికాలో అంతకంటే పెద్దసంఖ్యలో అభిమానులనుద్దేశించి మాట్లాడబోతున్నారు. సెప్టెంబర్ 22 న ఆదివారం హ్యూస్టన్లో నిర్వహించే ఈవెంట్లో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటున్నారు.
ఇటీవల కశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయం… ఈ క్రమంలో అంతర్జాతీయంగా వచ్చిన విమర్శల నుంచి ఇది ఆయన్ను విముక్తుడిని చేస్తుందని చాలామంది భావిస్తున్నారు. ‘హౌడీ మోదీ’ పేరిట నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కు 50 వేల మంది హాజరవుతారని అంచనా. భారతదేశం వెలుపల మోదీ మద్దతుదారులు ఇంత పెద్దసంఖ్యలో పోగవడం ఇదే తొలిసారి. ట్రంప్తో కలిసి ఇలా అమెరికాలో సభ నిర్వహించడమనేది అంతర్జాతీయ ప్రజాసంబంధాల వ్యవహారంలో మోదీ సాధించిన విజయమనే చెప్పాలి. అమెరికా, భారత్ మధ్య సంబంధాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
‘ఇది అమెరికాలో భారతీయ అమెరికన్ సమాజ బలిమిని ప్రతిబింబిస్తోంది’ అని ఒబామా అడ్మినిస్ట్రేషన్లో విదేశీ వ్యవహారాలలో భారత్, దక్షిణాసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన నిషా బిస్వాల్ తెలిపారు. ట్రంప్ ఈ సభకు హాజరవడం గొప్ప పరిణామమని ఆమె స్పష్టం చేశారు. మోదీ, ట్రంప్ మధ్య బంధం ఇప్పుడు వ్యక్తిగత, రాజకీయాల స్థాయి దాటి ముందుకెళ్లిందని నిషా వివరించారు.
‘హౌడీ మోదీ’ ఈవెంట్ నిర్వాహకులు డెమొక్రటిక్ పార్టీ ప్రముఖులు స్టెనీ హోయర్ వంటివారు, పలువురు ఇతర కాంగ్రెస్ నేతలు, వివిధ రాష్ట్రాల గవర్నర్లను కూడా పిలిచి ఇది ఇరుదేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక వ్యవహారంలా మార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు హ్యూస్టన్ను వేదికగా ఎంచుకోవడంలోనూ ఆశ్చర్యం లేదు. భారత్తో వాణిజ్య భాగస్వామ్యం ఉన్న నాలుగో అతిపెద్ద నగరం హ్యూస్టన్. అమెరికాతో ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి భారత్కు ఇదో అవకాశం కూడా. మరోవైపు గత ఏడాదిన్నర కాలంలో భారత్, అమెరికాల మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాలను రూపుమాపుకొనేందుకూ ఈ సభ సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మోదీ అది తాను సాధించిన విజయంగా భావిస్తారు. ఇక ట్రంప్ వైపు నుంచి చూస్తే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు అనుకూలంగా అమెరికాలోని భారతీయులు వ్యవహరించేలా ఈ సభ సహకరిస్తుంది . అమెరికాలో భారతీయుల జనాభా 32 లక్షలు.. ఆ దేశ జనాభాలో ఒక శాతం.
అమెరికాలోని భారతీయుల్లో అత్యధికులు డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరులు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికులు హిల్లరీ క్లింటన్కు ఓటేశారని ‘ఆసియన్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్’ అనే సంస్థ తెలిపింది. మోదీ జాతీయవాద దృక్పథం, భారతదేశాన్ని ప్రపంచదేశాల మధ్య సగర్వంగా నిలపుతానంటూ ఆయన చేసే ప్రతిజ్ఞల కారణంగా అమెరికాలోని భారతీయుల్లో ఆయనకు విశేషాదరణ లభిస్తోంది. ఈ సభ తరువాత అమెరికాలోని మోదీ అభిమానుల్లో చాలామంది డెమొక్రాట్ల నుంచి తమ వైపు మళ్లుతారని రిపబ్లికన్లు ఆశిస్తున్నారు.
మోదీ అమెరికా టూర్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా ట్రంప్తో మోదీ ఈ ఏడాది మూడోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకుముందు జపాన్లో జరిగిన జీ20 సదస్సులో, ఆ తర్వాత ఆగస్ట్లో ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సులో వాళ్లిద్దరూ కలిశారు. నేడు జరిగే హౌడీ-మోదీ ఎన్నారైల సదస్సులో ట్రంప్… ప్రవాస భారతీయులను ఉద్దేశించి… కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని తెలిసింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్న ట్రంప్… ఈ సదస్సును అందుకు వేదికగా చేసుకోబోతున్నారు.
కాగా… హ్యూస్టన్ సభ అనంతరం ప్రధాని మోదీ గేట్స్ ఫౌండేషన్ నుంచి స్వచ్ఛతా అవార్డు అందుకోబోతున్నారు. అయితే, కశ్మీర్ విషయంలో మోదీ తీరును నిరసిస్తూ కొందరు ఈ అవార్డును మోదీకి ఇవ్వరాదంటూ గేట్స్ ఫౌండేషన్కు లక్ష సంతకాలతో ఫిర్యాదు చేశారు. అయితే, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దీనిపై స్పందిస్తూ ‘భారత దేశంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన విజయాలకు గాను ఈ అవార్డు ఇస్తున్నాం. మా నిర్ణయం సరైనదే’నని స్పష్టం చేశారు.
Howdy Houston!
PM @narendramodi arrived in #Houston. Over the next 24 hours, PM will meet with the industry captains in energy sector & address the Indian American community and their elected representatives at #HowdyModi event, together with @realDonaldTrump. pic.twitter.com/BdyBkY67V1
— Anurag Srivastava (@MEAIndia) September 21, 2019