తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
‘ ఈ ఘటన జరగడం దురదృష్టకరం. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని చంద్రబాబు కోరారు’. పాపికొండలు లాంటి పర్యాటక ప్రదేశానికి వెళ్తూ ప్రమాదానికి గురికావడం బాధాకరం అని.. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ఆయన వ్యక్తం చేశారు.
‘బోటు ప్రమాదంలో 50 మందికి పైగా గల్లంతవడం బాధాకరమని.. పర్యాటకుల ఆచూకీ, ఇతర సహాయక చర్యలు నిమిత్తం జనసేన శ్రేణులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా ఈ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.