ఎగ్జిట్ పోల్స్ ఫలితాల జోష్ బీజేపీ శ్రేణుల్లో చాలా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మెజారిటీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఆ పార్టీలో జోష్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డ తెల్లారే యూపీలో అధికార బీజేపీ భాగస్వామ్య పక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్బర్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు కేబినెట్ హోదా తొలగించాలని రాష్ట్ర గవర్నర్ను కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో రాజబర్కు, బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆయన తన మంత్రి పదవికి ఏప్రిల్ 13నే రాజీనామా చేశారు. బీజేపీ ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీచేయాలని కోరిందని, తాను తన సొంత పార్టీ గుర్తుపై బరిలోకి దిగుతానని చెప్పానని, దానికి బీజేపీ నో చెప్పడంతో.. మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన గతంలో వివరణ ఇచ్చారు.
అయితే, యోగి నిర్ణయాన్ని రాజ్బర్ స్వాగతించారు. మొదట సామాజిక న్యాయ కమిటీని ఏర్పాటు చేసి. తర్వాత ఆ కమిటీ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో పడేశారన్నారు. ఆ రిపోర్ట్లోని మార్గదర్శకాలను అమలుచేసేందుకు సమయం కూడా కేటాయించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఎంత వేగంగా నిర్ణయం తీసుకున్నారో అంతేవేగంగా ఆ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.