అమరవీరుడికి నివాళి.. కల్నల్ సంతోష్బాబు విగ్రహం రెడీ..!
భారత్-చైనా బార్డర్ వివాదంలో ఇరు దేశాల సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ప్రతిష్ఠకు రెడీ అవుతోంది.

భారత్-చైనా బార్డర్ వివాదంలో ఇరు దేశాల సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ప్రతిష్ఠకు రెడీ అవుతోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ కి గౌరవార్థంగా ఆయన సొంత ఊరు సూర్యాపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విగ్రహం తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శిల్పులు ప్రతిమను తయారు చేస్తున్నారు. ఇప్పటికే విగ్రహ నిర్మాణం పూర్తిగా, తుది మెరుగులు దిద్దుతున్నారు. కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేట పాత బస్టాండ్ జంక్షన్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఈ నెల 15న తూర్పు లఢక్ వద్ద గల గల్వాన్ లోయలో భారత సైనికులతో చైనా దళాలు ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కల్నల్ సంతోష్బాబుతో పాటు మరో 20 మంది సైనికులు అమరులయ్యారు. దీంతో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ సర్కార్ తోడుగా నిలిచింది. కల్నల్ భార్యకు గ్రూపు-1 ఉద్యోగం ఇచ్చింది. అంతేకాదు బంజారాహిల్స్లో ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదు కూడా అందించింది. సీఎం కేసీఆర్ స్వయంగా సూర్యాపేట వెళ్లి కల్నల్ కుటుంబాన్ని పరామర్శించారు.