
గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఉన్నామని సీఎం జగన్కు తెలిపారు. నేను ఏరియల్ సర్వేకు వస్తున్నట్లుగా వారికి తెలిపారు. తాను వస్తున్నందున.. అధికారులు ఎవరూ సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదని స్పష్ట చేశారు. అందుకే ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానను అని సీఎం జగన్ వారికి తెలిపారు.
ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సీఎం స్పష్టం చేశారు.
వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం కావాలని సూచించారు. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలిని అధికారులకు సూచించారు. వారు ఇచ్చే సమాచారం తీసుకోవడంపై ఒక అధికారిని కూడా పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించలని… ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, ఎల్లుండికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోందని అన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. ఎన్యుమరేషన్ 10 రోజుల్లోగా చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.