BJP Leader Kapil Mishra: ఢిల్లీలో రెచ్ఛగొట్టే.. విద్వేషపూరిత ప్రసంగాలు చేసి.. అల్లర్లకు, హింసకు, ఘర్షణలకు కారకుడయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రా.. ‘హిందుత్వ’ నినాదంతో మళ్ళీ ‘శాంతిదూత’ లా ఢిల్లీ వీధుల్లో ప్రత్యక్షమయ్యారు. ఆర్ ఎస్ ఎస్ మద్దతుతో కొనసాగుతున్న ‘ఢిల్లీ పీస్ ఫోరమ్’ అనే ఎన్జీవో నిర్వహించిన శాంతియాత్రలో ఆయన పాల్గొన్నారు. ‘జై శ్రీరామ్,’, ‘భరత్ మాతా కీ జై’ అనే నినాదాలు చేస్తూ పలువురు ఈ పీస్ మార్చ్ లో పాల్గొన్నారు. ‘జిహాదీ వయొలెన్స్ కి ఢిల్లీ వ్యతిరేకం’ వంటి స్లోగన్స్ రాసి ఉన్న ప్లకార్డులను వీరంతా చేత పట్టుకున్నారు. ఇటీవల అల్లర్లలో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ రతన్ లాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మల పోస్టర్లతో బాటు.. దినేష్ ఖాతిక్ అనే దళితుడి పోస్టర్ ను కూడా ఈ ప్రదర్శన జరిగిన చోట ఉంచారు. కపిల్ మిశ్రా ఎలాంటి ప్రసంగం చేయకున్నా.. ‘బుధ్ది’ గా ప్రదర్శనకారులకు మూడో వరుసలో కూర్చున్నారు. అయితే ఆయనను తామేమీ ఆహ్వానించలేదని, తనకు తానే వచ్చారని ఢిల్లీ పీస్ ఫోరమ్ నిర్వాహకులు తెలిపారు. ఈ శాంతియాత్రలో ఆయన పాల్గొనడంపట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా-జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ ప్రదర్శనకు హాజరు కావాలంటూ కపిల్ మిశ్రా తన ట్విట్టర్ ద్వారా కోరారు. ఆయన మద్దతుదారులు ఆయనకు అనుకూల నినాదాలు చేశారు. అల్లర్లలో తమ వారిని, తమ ఇళ్లను, ఆస్తులను కోల్పోయినవారు, గాయపడినవారు ఈ శాంతియాత్రలో పాల్గొన్నారు. జంతర్ మంతర్ నుంచి కన్నాట్ ప్లేస్ వరకు ఈ పీస్ మార్చ్ సాగింది.